AP Cabinet : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. 42 అజెండా అంశాలకు ఆమోదం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 42 అజెండా అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా అమరావతి మలివిడత భూ సమీకరణ, రెవెన్యూ సమస్యలు, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై కీలకంగా చర్చించారు.

అమరావతి భూ సమీకరణపై స్పష్టత:
మలివిడత భూ సమీకరణకు తొలి విడత నిబంధనలు వర్తింపజేయాలని నిర్ణయించారు. రైతులకు న్యాయం చేయడంతో పాటు భూ సమీకరణ ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రెవెన్యూ సమస్యలపై చంద్రబాబు వార్నింగ్:
రెవెన్యూ సమస్యలు ఏడాదిలోగా పరిష్కరించాల్సిందిగా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సాంకేతిక సమస్యల పేరిట సమస్యల్ని వదిలేయడం సరికాదని ఆయన తెలిపారు. “ఎన్ని సార్లయినా నన్ను సంప్రదించండి, కానీ ప్రజలకు నష్టం కలగకుండా చూడాలి” అంటూ స్పష్టం చేశారు.

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం:
ఈ కార్యక్రమాన్ని జిల్లాల వారీగా ఇంచార్జ్ మంత్రుల నేతృత్వంలో నిర్వహించనున్నారు. అనంతరం నియోజకవర్గాల స్థాయిలోకి విస్తరించనున్నారు.

కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికి:
జూలై 1 నుంచి ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు.

అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కీలక దిశా నిర్దేశం:
ప్రతి నియోజకవర్గ కేంద్రం, మండలాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాటి నిర్వహణ, పర్యవేక్షణ, విరాళాల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటుకానుంది.

Leave a Reply