Amaravati: అమరావతికి భవిష్యత్తు దిశగా కొత్త ఆరంభం.. మోదీ, చంద్రబాబు వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశల కిరణంగా అభివృద్ధి పథంలోకి అడుగుపెట్టిన అమరావతి రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ పనులకు అట్టహాసంగా శ్రీకారం చుట్టారు. ఈ వేడుకలో రాష్ట్ర రైతుల త్యాగాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం వారికి గౌరవం తెలిపారు. భూములు సమర్పించిన రైతుల నిబద్ధతకు ప్రధాని నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ సెల్యూట్‌ చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, అమరావతిని కేవలం కాంక్రీట్ నిర్మాణంగా కాకుండా, వికసిత్ భారత్‌కు బలమైన పునాది గా అభివర్ణించారు. ‘‘ఇది ఆంధ్రుల కలల రాజధాని మాత్రమే కాదు.. దేశ అభివృద్ధిలో కీలక కేంద్రంగా మారనుంది,’’ అని చెప్పారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘చీకటి పై వెలుగు గెలిచింది.. ఇది నవశకం ఆరంభం,’’ అంటూ భావోద్వేగంగా స్పందించారు. మూడు సంవత్సరాల్లో రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.

మోదీ ట్వీట్‌: ‘‘చంద్రబాబు నాకు మంచి మిత్రుడు’’
ఈ కార్యక్రమానంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా కీలకంగా స్పందించారు. ‘‘అమరావతి అభివృద్ధిలో చారిత్రాత్మక అధ్యాయం ప్రారంభించిన సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య ఉండటం గర్వంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు మంచి మిత్రుడు. ఆయనకు ఉన్న దార్శనికత, రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్ల నిబద్ధతకు నేను అభినందనలు తెలుపుతున్నాను,’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఫ్యూచర్ సిటీగా అమరావతి అభివృద్ధి: చంద్రబాబు ట్వీట్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ప్రతి ఒక్కరి సహకారంతో అమరావతిని ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దేందుకు సిద్ధం. ఇది అన్ని ప్రాంతాలకు సమగ్ర అభివృద్ధి అందించే రాజధానిగా నిలుస్తుంది. ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా నిర్మాణం సాగుతుంది. మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు,’’ అని తెలిపారు.

Leave a Reply