Amaravati: అమరావతి రైతుల ధర్మయుద్ధం విజయవంతం.. పవన్ కళ్యాణ్

రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు తమ భూములను సమర్పించిన అమరావతి రైతుల త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో స్పందించారు. ఐదేళ్లుగా లాఠీదెబ్బలు తిని, ముళ్లకంచెల మధ్య నిరసనలు చేస్తూ, రాజధాని కోసం పోరాడిన రైతులకు న్యాయం జరిగిన దశను పవన్ “ధర్మయుద్ధంలో గెలుపు”గా అభివర్ణించారు. రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని కొనసాగించడమే తమ ప్రభుత్వం కట్టుబడి తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు.

పది వేలకుపైగా రైతులు అమరావతికి భూములు ఇచ్చారు. కానీ గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. భూములు ఇచ్చినప్పటికీ తీరని దౌర్జన్యాలు ఎదుర్కొన్న రైతుల కన్నీళ్లకు న్యాయం జరిగిందన్నారు పవన్. తాను వారిని వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

గత ఐదేళ్లలో ఆందోళనల మధ్య 2 వేలమందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయిన విషాదాన్ని గుర్తు చేసిన పవన్, వారిని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి రావడం గర్వకారణంగా పేర్కొన్నారు. దేశ ప్రధాని స్వయంగా అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి విచ్చేయడం ద్వారా రైతుల త్యాగానికి గౌరవం చూపించారని చెప్పారు.

ఇకపోతే, కశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్రదాడిలో 27 మంది మరణించిన విషాద సమయంలో కూడా ప్రధాని మోదీ ఏపీ ప్రజల కోసం వచ్చిన దృఢ సంకల్పాన్ని పవన్ ప్రశంసించారు. భవానీ అమ్మ మోదీ గారికి ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. రాష్ట్రం మొత్తం తరపున రైతులు, మహిళలు, విద్యార్థులు తిన్న గాయాలు మర్చిపోలేమని, వారి ఆశలు నెరవేరేలా అమరావతిని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply