స్టీల్ ప్లాంట్ ఉద్యోగి వరప్రసాద్ మృత దేహం లభ్యం

STIL PLAMT EMPLOY: స్టీల్ ప్లాంట్ ఉద్యోగి వరప్రసాద్ మృత దేహం లభ్యం

వరప్రసాద్ దంపతులు ఆత్మహత్య చేసుకునే ముందు విడుదల చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దంపతులు సెల్ఫీవీడియో తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నామని కుమారుడు, బంధువులకు సెల్ఫీ వీడియో పంపించారు. ‘‘మామయ్య, పిన్ని, చిన్నాన్న…మా ఇద్దరి పిల్లలను బాగా చూసుకోండి. దయచేసి వారిని ఏమీ అనకండి. నవీన్‌…నా కూతురు అమాయకురాలు. మీకు ఇవ్వాల్సింది ఇవ్వలేదని దాన్ని ఏమీ అనకండి, మేము శాశ్వతంగా వెళ్లిపోతున్నాము. పిల్లలూ ఎవరు ఏమన్నా పట్టించుకోకండి. ధైర్యంగా ఉండండి’’ అంటూ ఉక్కు ఉద్యోగి దంపతులు రోదిస్తూ తీసుకున్న సెల్ఫీ వీడియోను బంధువులు, సన్నిహితులకు పంపి సోమవారం రాత్రి ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన దువ్వాడ పోలీసులు సెల్‌ సిగ్నల్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అనకాపల్లి మండలం కొప్పాక వద్ద ఏలేరు కాలువ పక్కన దంపతుల చెప్పులు, సెల్‌ఫోన్‌, హ్యాండ్‌ బ్యాగ్‌ లభించాయి.

స్టీల్  ప్లాట్ ఉద్యోగి చిత్రాడ వరప్రసాద్‌ (47), భార్య మీరా (41), కుమారుడు కృష్ణ సాయితేజ (19)తో శివాజీనగర్‌లో నివాసం ఉంటున్నారు. గత ఏడాది కుమార్తెకు వివాహం చేశారు. కుమారుడు కృష్ణసాయితేజతో కూర్మన్నపాలెంలో ఓ బ్యాటరీ దుకాణం పెట్టించారు. వరప్రసాద్‌ కొద్దికాలంగా వెన్నెముకకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. కుటుంబ, ఆరోగ్య అవసరాల కోసం తోటి ఉద్యోగుల వద్ద అధిక వడ్డీలకు అప్పు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. అప్పులు ఇచ్చినవారు తరచూ ఇంటి వద్దకు వచ్చి డబ్బులు చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేస్తుండడంతో మనస్తాపం చెందేవారని సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరమై ఉద్యోగం పోయే పరిస్థితి వస్తే అప్పులు ఎలా తీరుస్తామని ఆందోళనకు గురయ్యేవారని అంటున్నారు. ఈ క్రమంలో సెల్ఫీ వీడియో బంధువులకు పంపి ఇంటి నుంచి వెళ్లిపోయారు.

అయితే ఆత్మహత్య చేసుకున్న వరప్రసాద్ దంపతుల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి వరప్రసాద్ మృతదేహం లభ్యమైంది. అనకాపల్లి జిల్లా ఏలూరు కాలువలో కొప్పాక వద్ద వరప్రసాద్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వడ్లపూడి తిరుమలనగర్‌కు చెందిన దంపతులు వరప్రాసద్, మీరా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ దంపతులు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. నిన్న ఉదయం నుంచి వరప్రసాద్ దంపతుల కోసం దువ్వాడ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం అనకాపల్లి జిల్లా ఏలూరు కాలువలో కొప్పాక వద్ద వరప్రసాద్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మీరా కోసం గాలింపు కొనసాగుతోంది.  వరప్రసాద్ దంపతులు చనిపోయిన విషయం తెలిసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

 

Leave a Reply