Zubeen Garg : అస్సామీ సింగర్ జుబిన్ గార్గ్ అంత్యక్రియలకు ప్ర‌పంచ రికార్డ్..!

అస్సామీ సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించిన గాయకుడు జుబిన్ గార్గ్ అంత్యక్రియలు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాయి. జుబిన్ గార్గ్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన ఓ ప్రమాదంలో మృతి చెందారు.

మంగళవారం, ఆయనను చివరిసారి వీక్షించేందుకు లక్షలాది మంది అభిమానులు గువహతిలో జరిగే అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ అంతిమయాత్ర చరిత్రలో అత్యధిక మంది ప్రజలు పాల్గొన్నంత్యక్రియలలో ఒకటిగా లిమ్కా బుక్ పేర్కొంది.

మైఖేల్ జాక్సన్, పోప్ ఫ్రాన్సిస్, క్వీన్ ఎలిజబెత్ II వంటి ప్రముఖుల అంత్యక్రియల తర్వాత అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్న నాలుగవ అంతిమయాత్రగా జుబిన్ గార్గ్ అంత్యక్రియలు నిలిచాయి. గువహతిలోని రోడ్లు జుబిన్ అభిమానులతో నిండిపోయాయి. ఆయన భౌతికకాయాన్ని విమానాశ్రయం నుండి నివాసానికి, ఆ తర్వాత అర్జున్ భోగేశ్వర్ బారువా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వరకు, అప్పుడు దహన స్థలానికి తీసుకెళ్లే మార్గమంతా వేలాది మంది ప్రజలు నిలబడి వీడ్కోలు పలికారు.

కేవలం గాయకుడిగా మాత్రమే కాదు, నటుడు, సంగీత దర్శకుడు, దర్శకుడిగా కూడా జుబిన్ గార్గ్ అస్సాంలో ప్రసిద్ధి పొందారు. ఆయన పాటలు అస్సామీ ప్రజల జీవితంలో ఒక ముఖ్య భాగమయ్యాయి. “గ్యాంగ్‌స్టర్” చిత్రంలోని “యా అలీ” పాటతో జుబిన్ దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. 40 భాషల్లో 38,000 పైగా పాటలు పాడి, సంగీతానికి విశేష సేవలందించిన జుబిన్‌ను అస్సామీ ప్రజలు “కింగ్ ఆఫ్ హమ్మింగ్” అని ముద్దుగా పిలుస్తారు.

జుబిన్ గార్గ్ మరణం అస్సాం ప్రజలకు తీరని లోటు మిగిల్చింది. అంత్యక్రియలకు అభిమానులు ఈ స్థాయిలో తరలిరావడం, ఆయన పట్ల ఉన్న అపారమైన అభిమానాన్ని చాటి చెప్పింది. ఈ అరుదైన, భావోద్వేగపూరిత వీడ్కోలు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించడం కేవలం రికార్డు మాత్రమే కాదు, ఒక గొప్ప కళాకారుడికి ప్రజలు ఇచ్చిన అద్భుత నివాళి అని చెప్పాలి.

Leave a Reply