Yoga Day 2025: యోగాంధ్రా గ్రాండ్ సక్సెస్: విశాఖ RK బీచ్‌ వద్ద మోడీ, చంద్రబాబు యోగాసనాలు..!

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో ‘యోగాంధ్రా’ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాక, ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లు సాధారణ ప్రజలతో కలిసి యోగాసనాలు వేయడం విశేషం. అంతకు ముందు ప్రధాని మోడీ, యోగా డే పోస్టల్ స్టాంప్‌ను ఆవిష్కరించారు.

ఉదయం 4 గంటల నుంచే విశాఖ తీరానికి ప్రజల రాక ప్రారంభమైంది. 5.45 నిమిషాల కల్లా 1.5 లక్షల మందికిపైగా యోగా సాధనకు హాజరయ్యారు. క్యూ ఆర్ కోడ్ ద్వారా నమోదు అయినవారినే లెక్కించడం జరిగింది. ఉదయం 8 గంటల వరకు సుమారు 3 లక్షల మంది పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రికార్డు ద్వారా సూరత్‌లో 1,47,952 మందితో ఏర్పడిన మునుపటి రికార్డును బద్దలుకొట్టి, యోగాంధ్రా చరిత్ర సృష్టించింది.

జాతి, మతాలకు అతీతంగా యోగా పాటించాలి: సీఎం చంద్రబాబు

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో అట్టహాసంగా నిర్వహించారు. ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు అంగవస్త్రంతో సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ మూలాలున్న యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని, రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా యోగా దినోత్సవంలో పాల్గొనడం గర్వకారణమని చెప్పారు. మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో అవసరమని, యోగా సాధన ప్రతి జీవితంలో భాగం కావాలన్నారు.

2.17 కోట్ల మంది యోగా కోసం ఎన్‌రోల్ కావడం, 22 వేల గిరిజన విద్యార్థులు గిన్నీస్ రికార్డు సాధించడం విశేషంగా పేర్కొన్నారు.
సెప్టెంబర్‌లో యోగా సూపర్ లీగ్ ప్రారంభం కానుందని, రికార్డులు మోడీ వల్లే సాధ్యమయ్యాయని అన్నారు. జాతి, కుల, మతాలకు అతీతంగా యోగా మన దైనందిన జీవితంలో భాగంగా ఉండాలన్నారు. విజన్ స్వర్ణాంధ్ర-2027 లక్ష్యాలను వికసిత్ భారత్ భాగంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.

యోగాను విశ్వవ్యాప్తం చేసిన నేత ప్రధాని మోడీ: పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. యోగ విద్యను ప్రపంచానికి అందించిన ఆది యోగి పరమశివునికి, శాస్త్రీయంగా అందించిన పతంజలి మహర్షికి నమస్కారం తెలిపారు. యోగాను రుగ్వేదంలో మహానుభావులు వివరించినా, దాన్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లిన దార్శనికుడు మోడీ అని కొనియాడారు. 2014లో ఐక్యరాజ్య సమితిలో యోగా ప్రతిపాదనకు 177 దేశాలు మద్దతిచ్చిన ఘనత మోడీదేనన్నారు. “వన్ ఎర్త్, వన్ హెల్త్” అనే నినాదం మానవతా దృష్టికి మార్గదర్శకమన్నారు.

ప్రకృతి-ప్రగతి సంగమంగా విశాఖ: ప్రధాని మోడీ

ప్రధాని మోడీ మాట్లాడుతూ.. విశాఖ నగరాన్ని “ప్రకృతి, ప్రగతి సంగమ స్థలంగా” అభివర్ణించారు. యోగా ప్రపంచాన్ని కలిపే సామూహిక ప్రక్రియగా ఎదిగిందని, గత 10 ఏళ్లలో కోట్లాది మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపిందని అన్నారు. యోగా వయస్సుతో సంబంధం లేని సాధన అని, ప్రతీ గ్రామంలో యువకుల నుంచి వృద్ధుల వరకు యోగా చేస్తున్నారని చెప్పారు. ఈసారి ‘వన్ ఎర్త్, వన్ హెల్త్’ థీమ్‌‍తో యోగా డే జరుపుకోవడం గర్వకారణమన్నారు. నేవీకి చెందిన నౌకలపైనా యోగాసనాలు చేయడం చూసి ఆశ్చర్యపోయానన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యద్భుతంగా నిర్వహించినందుకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు అభినందనలు తెలిపారు.
యోగా ప్రక్రియ ఆధారంగా చికిత్స పద్ధతులు అభివృద్ధి చేయడంలో ఢిల్లీ ఎయిమ్స్ ముందంజలో ఉందని చెప్పారు. ఇకో సిస్టమ్ ద్వారా యోగాను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ‘మన్ కి బాత్’ కార్యక్రమంలో కూడా యోగా ప్రాముఖ్యతపై చర్చించానని చెప్పారు.

యోగా మనలో మానవత్వాన్ని పెంపొందించే సాధనమని, వ్యక్తిగత క్రమశిక్షణకు ఇదొక అద్భుత ఆయుధమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. నూనె పదార్థాల వినియోగాన్ని తగ్గించాలనే సూచన చేస్తూ, మంచి జీవనశైలి వైపు యోగా మనల్ని నడిపిస్తుందన్నారు.

Leave a Reply