విజయనగరం టెర్రర్ కేసులో కొత్త మలుపు.. జిహాదీ కుట్రపై ఎన్ఐఏ దూకుడు!

విజయనగరం ఉగ్రకుట్ర కేసులో షాకింగ్ వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ బోయగూడకు చెందిన సమీర్ అలీ ఖాన్ ‘ఇత్తేహదుల్ ముస్లిమీన్’ అనే గ్రూప్‌ను స్థాపించి, దక్షిణాది రాష్ట్రాలలో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఈ కుట్ర కేంద్రాలుగా హైదరాబాద్, విజయనగరం, వరంగల్ ప్రాంతాలు పనిచేశాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ గ్రూప్‌లో కీలక సభ్యుడైన సిరాజ్ 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, పోలీస్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యాడు. కుటుంబంలోనే పోలీసులు ఉన్నా, సిరాజ్‌ను నిరాశే వెంటాడింది. ఈ సమయంలోనే అతను సమీర్‌తో పరిచయమై, జిహాదీ ఆలోచనల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

సమీర్‌, సిరాజ్‌లు సౌదీలోని అబూ ముసబ్ అనే వ్యక్తి సూచనలతో పాటు టిఫిన్ బాక్స్‌లు, వైర్లు, పేలుడు పదార్థాలు సేకరించి విజయనగరం జిల్లా అటవీ ప్రాంతాల్లో బాంబు ప్రయోగాలకు ట్రయల్స్‌ నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. వీరు సిగ్నల్ యాప్ ద్వారా ఒకరితో ఒకరు గోప్యంగా సంభాషించేవారని విచారణలో తేలింది.

దర్యాప్తు సంస్థల కథనం ప్రకారం, ఈ గ్రూప్ సభ్యులంతా ఒకే మత సామాజిక వర్గానికి చెందిన వారు. మతపరమైన అసంతృప్తిని జిహాదీ దిశగా మలచుకున్న ఈ వ్యవహారం దేశీయ భద్రతకు తీవ్రమైన హెచ్చరికగా మారుతోంది. అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని సిరాజ్, సమీర్‌లు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ చేపట్టి, ప్రధాన నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తోంది. విచారణలో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply