తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై లడ్డూ ప్రసాదం కోసం క్యూల్లో నిలబడి ఉండాల్సిన అవసరం లేకుండా కియోస్క్ మిషన్ల ద్వారా లడ్డూలు పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ నూతన విధానంలో, భక్తులు తమ దర్శన టికెట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ను కియోస్క్ మిషన్లో ఎంటర్ చేసి, వచ్చిన QR కోడ్ను స్కాన్ చేసి పేమెంట్ చేస్తారు. అనంతరం వచ్చే రసీదును కౌంటర్ వద్ద చూపించి లడ్డూలను పొందవచ్చు.
ఇప్పటికే తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద 5 కియోస్క్ మెషిన్లు యూనియన్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేశారు. ఇది ప్రయోగాత్మకంగా ప్రారంభించిన విధానం. భక్తులు దీని ద్వారా వేగంగా, క్రమబద్ధంగా లడ్డూలు పొందుతున్నారు. సాంకేతికతను ఉపయోగించి సేవలు మరింత వేగవంతం చేయడమే టీటీడీ లక్ష్యం.
దర్శన టికెట్ లేని భక్తులు కూడా తమ ఆధార్ నెంబర్ ద్వారా రెండు లడ్డూలను పొందే అవకాశం కల్పించారు. ఇప్పటికే ఇదే విధానం అన్నప్రసాదం కేంద్రాల్లో అమలులో ఉంది, అలాగే డోనర్లు రూ.99,000 వరకు డొనేషన్ చేయగలిగే కియోస్క్లు కూడా ఏర్పాటయ్యాయి.
టీటీడీ అధికారుల ప్రకారం, ఈ వ్యవస్థలో లోపాలేమైనా ఉంటే వాటిని గుర్తించి మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. భవిష్యత్లో గదుల బుకింగ్, మరిన్ని సేవలకూ కియోస్క్ మిషన్లను విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం.