సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద జరిగిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. భారీ వర్షాల కారణంగా రూ.300 టికెట్ క్యూలైన్ వద్ద గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ప్రధాని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాని సహాయ నిధి నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపారు.
Deeply saddened by the loss of lives due to the collapse of a wall in Visakhapatnam, Andhra Pradesh. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The…
— PMO India (@PMOIndia) April 30, 2025
ఇదిలా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషాద ఘటనపై వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం వైఎస్ జగన్ వంటి ప్రముఖ నాయకులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అప్పన్న స్వామి సన్నిధిలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం, రాష్ట్ర స్థాయిలో మరింత సహాయం అందించనున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.3 లక్షలు అందించనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, బాధిత కుటుంబాలకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ ప్రమాదం ఆలయాల్లో భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తించింది. భక్తుల ప్రాణాలకు విలువనిచ్చే విధంగా భద్రతా చర్యలు మరింతగా బలపడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.