భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా చరిత్రలోకి అడుగుపెట్టబోతున్నారు. ఎన్నో వాయిదాల అనంతరం, చివరికి జూన్ 25 మధ్యాహ్నం 12:01 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ఆయన అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు.
యాక్సియం-4 మిషన్ లో భాగంగా మొత్తం నలుగురు వ్యోమగాములు ఈ ప్రయోగంలో భాగమవుతారు. శుభాంశు శుక్లా మిషన్ పైలట్గా, పెగ్గి విట్సన్ (అమెరికా), టిబోర్ కపు (హంగేరీ), స్లావోస్జ్ (పోలెండ్)లతో కలిసి డ్రాగన్ వ్యోమనౌకలో అంతరిక్షం వైపు ప్రయాణిస్తున్నారు.
ఈ ప్రయోగం ఇప్పటికే ఐదు వాయిదాలు ఎదుర్కొన్నది. చివరిసారిగా జూన్ 11న జరగాల్సిన ప్రయోగం, ఫాల్కన్-9లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కారణంగా వాయిదా పడింది.
ISS చేరనున్న తొలి భారతీయుడు
ఈ ప్రయోగంలో శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) లో అడుగుపెట్టనున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించనున్నారు. ప్రయాణ ప్రారంభమైన 28 గంటల తర్వాత ISSతో డాకింగ్ జరగనుంది. అక్కడ 14 రోజుల పాటు ఆయన సహా వ్యోమగాములు ప్రయోగాల్లో పాల్గొంటారు.
భారత్కు ప్రయోజనాలు
మైక్రో గ్రావిటీలో మొక్కల పెరుగుదలపై ప్రయోగం
కండరాల క్షీణతపై పరిశోధనలు
ఆరోగ్యం, వ్యవసాయం, జీవశాస్త్ర అంశాలపై అధ్యయనాలు
భవిష్యత్తులో గగన్యాన్ ప్రాజెక్టుకు కీలక అనుభవం
అంతర్జాతీయంగా ఇస్రో ప్రాముఖ్యత పెరుగుతుంది
ప్రధాని మోదీతో లైవ్ కమ్యూనికేషన్
ISS లో ఉన్నపుడే శుభాంశు శుక్లా & టీం, ప్రధాని నరేంద్ర మోదీ, విద్యార్థులు, శాస్త్రవేత్తలతో లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించనున్నారు.
భారత ప్రభుత్వం ఈ ప్రయోగంలో భాగంగా ₹550 కోట్ల వ్యయం చేసింది. 1984లో రాకేష్ శర్మ తర్వాత మళ్లీ ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం గర్వకారణం. ఇది కేవలం అంతరిక్ష యాత్ర కాదు.. భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం.