RCB: ఆర్సీబీ అమ్మకానికి? షాక్‌లో అభిమానులు.. యాజమాన్యం సంచలన నిర్ణయం..!

ఐపీఎల్‌లో బోలెడు అభిమానులను కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీని అమ్మేందుకు యాజమాన్యం ఆలోచిస్తోందన్న వార్తలు అభిమానుల హృదయాలను కలచివేస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ స్పిరిట్స్ కంపెనీ డియాజియో (Diageo) ప్రస్తుతం ఈ జట్టును పూర్తిగా లేదా కొంతభాగాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తోందని సమాచారం.

ఇటీవల బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలో పదకొండు మంది మరణించిన విషాద సంఘటన తర్వాత ఫ్రాంచైజీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. RCBని మొదట విజయ్ మాల్యా సొంతం చేసుకున్నా, ఆ తర్వాత డియాజియోకు తన వ్యాపారంతో పాటు జట్టు యాజమాన్యాన్ని కూడా విక్రయించారు.

ఆర్సీబీ విలువ 2 బిలియన్ డాలర్లు!

బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం, RCB విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు (రూ.16వేల కోట్లు) వరకు ఉంటుందని అంచనా. ఈ ప్రస్తుత మార్కెట్ విలువను లాభంగా మార్చుకునేందుకు యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (United Spirits Ltd) – డియాజియో యొక్క భారత అనుబంధ సంస్థ – తమ వాటాలో కొంత భాగం విక్రయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అల్కహాల్ ప్రచార ఆంక్షలే మరో కారణం?

ఇక మరోవైపు, బీసీసీఐ ఆల్కహాల్ మరియు పొగాకు ఉత్పత్తులపై విధించిన ఆంక్షల వల్ల తమ ఉత్పత్తులకు ప్రమోషన్ కష్టమవుతోందని భావించిన యునైటెడ్ స్పిరిట్స్ ఈ నిర్ణయం తీసుకుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఫ్రాంచైజీ యాజమాన్యంలో ఉన్న బ్రాండ్ వాల్యూను తమ వ్యాపారానికి ఉపయోగించుకునేందుకు మార్గాలు వెతుకుతున్నారని సమాచారం.

గత వారం అహ్మదాబాద్‌లో జరిగిన థ్రిల్లింగ్ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్సీబీ చరిత్రలో తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. ఇప్పుడు, ఈ విజయం తరువాతే అమ్మకానికి సన్నాహాలు ప్రారంభమవడం మరింత చర్చనీయాంశమైంది.

Leave a Reply