Modi-Chandrababu: చంద్రబాబును చూసి నేర్చుకోండి.. ప్రధాని మోదీ ప్రశంసలు..!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పరస్పర అభినందనలు, ప్రశంసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో మరోసారి ప్రధాని మోదీ – సీఎం చంద్రబాబు మధ్య మనోభావాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా చంద్రబాబు చేసిన ప్రజెంటేషన్‌ ప్రధాని మోదీని ఆకట్టుకుంది. దీంతో ఆయన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఈ భేటీకి ఏపీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు హాజరయ్యారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వికసిత్ భారత్ లక్ష్యంగా రాష్ట్రాలు తమ అభిప్రాయాలు, అభివృద్ధి సూచనలు ఈ సమావేశంలో పంచుకున్నాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు తన ప్రభుత్వ విజన్ పై, పీ4 (P4) కార్యక్రమం – ప్రజా పాలన, పారదర్శకత, ప్రగతి, ప్రాధాన్యతలపై వివరించడంతో పాటు ఎన్డీయే కూటమి ఏడాది పాలనలో సాధించిన పురోగతిని వివరించారు.

విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
వికసిత్ భారత్ దిశగా విశాఖను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. నాలుగు ప్రత్యేక జోన్లతో విశాఖ అభివృద్ధి మోడల్‌ను రూపొందిస్తున్నామన్నారు. ఇదే నమూనాను అమరావతి, కర్నూలు, తిరుపతి నగరాల్లో అమలు చేసేందుకు కేంద్ర సహకారం కోరారు. డిజిటల్ పాలన కింద ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ పాస్ బుక్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు.

మోదీ ప్రశంసలు.. ఇతర రాష్ట్రాలకు సూచన
చంద్రబాబు ప్రజెంటేషన్‌ను ఆసక్తిగా ఆలకించిన ప్రధాని మోదీ ఆయన అభిప్రాయాలను కొనియాడారు. వికసిత్ భారత్ సాధనలో చంద్రబాబు సూచనలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలు కూడా చంద్రబాబు విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. సమావేశానికి హాజరైన ఇతర నాయకులు, అధికారులూ చంద్రబాబు ఆలోచనల్ని స్వాగతించారు.

Leave a Reply