Pawan Kalyan: ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అంశంపై తన అభిప్రాయాన్ని బలంగా వ్యక్తీకరించారు. సోమవారం చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక సెమినార్‌లో పాల్గొన్న పవన్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఘనంగా ప్రశంసించారు. “దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించే నాయకుడు మోదీయే” అంటూ పవన్ మోదీపై తన పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. “దేశంలోని అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే.. ప్రభుత్వ ఖర్చులు తగ్గుతాయి.. పాలన మరింత ప్రభావవంతంగా ఉంటుంది.. ప్రజలు ఎన్నికల గందరగోళంలో చిక్కుకోకుండా ఉంటారు. ఇది కాలానుగుణ మార్పు కావాలసిందే. భారత్ వంటి జనాభా గల దేశంలో ఇది సాధ్యమే” అని వివరించారు.

తమిళనాడు రాజకీయాలపై స్పందన
తమిళనాడులో బీజేపీ కూటమికి మంచి అవకాశాలున్నాయంటూ పవన్ అన్నారు. అవసరమైతే అక్కడ ప్రచారం చేయడానికి తాను సిద్ధమని, దేశాభివృద్ధికి ఏ ప్రాంతంలోనైనా పనిచేయడానికి ఎల్లప్పుడూ ముందుండేవాడినని స్పష్టం చేశారు. అలాగే తన సినీ జీవితం, రాజకీయ బాధ్యతల గురించి మాట్లాడుతూ.. “సినిమాలు ఒక వైపు, ప్రజాసేవ మరొక వైపు. ప్రజల హక్కుల కోసం పోరాడడమే నా బాధ్యత” అన్నారు. తమిళ స్టార్ విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

వైఎస్సార్ కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు
ఈవీఎంలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను పవన్ తీవ్రంగా ఖండించారు.
“2019లో భారీ మెజారిటీతో గెలిచినప్పుడు అదే ఈవీఎంలు. ఇప్పుడు వాటిపై అనుమానాలు వ్యక్తం చేయడం వారి రాజకీయ మేచ్యూరిటీ లేకపోవడం చూపుతుంది” అని వ్యాఖ్యానించారు.
వైసీపీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, తమ గెలుపు కోసం ఎలాంటి తంత్రాలకైనా వెళ్తున్నారని ఆరోపించారు.

సనాతన ధర్మంపై దాడులపై ఆవేదన
“ఇది సనాతన ధర్మ భూమి. ప్రతి ఊర్లో రామాలయం ఉంది. కానీ ఇటీవల ధర్మం మీద గర్హణీయమైన వ్యాఖ్యలు, చర్యలు కొనసాగుతున్నాయి” అని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు.
“మన ధర్మం కేవలం చరిత్ర కాదు, అది జీవన విధానం. దాన్ని పరిరక్షించడం ప్రతి భారతీయుడి బాధ్యత” అంటూ ధ్వజమెత్తారు.

Leave a Reply