జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ మూకలు జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీనాయక్ ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన కలకలం రేపుతోంది. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఈ వీరుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, కల్లి తండాకు చెందినవాడిగా గుర్తించారు. చిన్ననాటి నుంచే దేశ సేవకు ఆసక్తి ఉన్న మురళీ నాయక్ సోమందేపల్లి మండలంలోని నాగినాయని చెర్వుతాండాలో పెరిగి, విజ్ఞాన్ పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు.
పహల్గాం ఉగ్రదాడుల అనంతరం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో మురళీ నాయక్ మృతి చెందాడు. ఈ వార్త అతని స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామ ప్రజలు అతని ఫోటోకు పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పిస్తున్నారు. పాకిస్థాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/QGtIAxMjug
— N Chandrababu Naidu (@ncbn) May 9, 2025
మురళీ నాయక్ మృతదేహాన్ని రేపు స్వస్థలానికి తరలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీనాయక్కు నా హృదయపూర్వక నివాళులు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.
దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మురళీ నాయక్ త్యాగం మరువలేనిది. అతనికి సమస్త దేశం ఓ మనసుగా నివాళులు అర్పిస్తోంది.