ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యతిరేక కంటెంట్ మరియు ఫేక్ న్యూస్ను అడ్డుకునే దిశగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోషల్ మీడియాలో భారత్ భద్రతను దెబ్బతీసేలా సాగుతున్న ఫేక్ ప్రచారంపై గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది.
పాకిస్థాన్ ఆధారిత సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఆపరేషన్ సిందూర్ను తక్కువ చేస్తూ జరుగుతున్న ప్రచారాలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో…
ఫేక్ సమాచారాన్ని పంచే అకౌంట్లను గుర్తించి వెంటనే బ్లాక్ చేయాలి
దేశం లోపలినుంచి లేదా విదేశాల నుంచి వ్యతిరేక ప్రచారం జరిగితే ఆయా ఖాతాలపై చర్యలు తీసుకోవాలి
సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతా దళాలు, ప్రభుత్వం మధ్య కమ్యూనికేషన్ బలపడాలి
ఇక ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి భారత్ జరిపిన వైమానిక దాడుల్లో తొమ్మిది ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయని, కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. గురువారమే ఈ వివరాలు అఖిలపక్ష సమావేశంలో వెల్లడయ్యాయి. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని కేంద్రం స్పష్టం చేసింది.