పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయానికి తెర వెనుక పనిచేసిన అసలైన హీరోలు ఎవరంటే? నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO)! ఈ కేంద్ర నిఘా సంస్థ అందించిన ఖచ్చితమైన సమాచారం వల్లే భారత ఎయిర్ ఫోర్స్ 25 నిమిషాల్లో తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి, దాదాపు 100 మందిని మట్టుబెట్టగలిగింది. శాటిలైట్ నిఘా, ఇంటర్నెట్ ట్రాకింగ్ వంటి అధునాతన సాంకేతికాలతో పని చేసే ఈ ఏజెన్సీ.. దేశ భద్రతకు అణచివేయలేని కవచంగా మారింది.
NTRO కీలకంగా ఎందుకంటే…
ఇది సాధారణ నిఘా సంస్థ కాదు. 2004లో ఏర్పాటు అయిన ఈ స్వతంత్ర సంస్థ, నేరుగా ప్రధాని కార్యాలయానికి జవాబుదారీగా పనిచేస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), రా (RAW) స్థాయిలో అధికారాలు కలిగిన ఈ ఏజెన్సీ, యుద్ధ ప్రణాళికల్లో ముందు వరుసలో ఉండకపోయినా… ప్లాన్ వేసే మేధస్సు ఇదే! 1999 కార్గిల్ యుద్ధంలో నిఘా లోపాలు ఇండియాకు తీవ్రమైన నష్టం కలిగించడంతో, అలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా ఉండేందుకే NTROను రూపొందించారు. అమెరికా ‘NSA’ తరహాలో రూపొందించిన ఈ సంస్థ గత రెండు దశాబ్దాల్లో అనేక విజయాలకు మూలకారణం అయింది.
ఎలా పనిచేస్తుంది?
NTRO శాటిలైట్లను ఉపయోగించి శత్రు దేశాల్లోని కదలికలను నిఘా చేస్తుంది. టెక్నాలజీ ఆధారిత సమాచారాన్ని సేకరించి భద్రతా దళాలకు అందిస్తుంది. తాజాగా జరిగిన ఆపరేషన్ సిందూర్ విజయానికి ఈ సంస్థ ఇచ్చిన సమాచారం కేంద్ర బిందువైంది. రహస్యమయంగా పనిచేసే ఈ ఏజెన్సీ గురించి ప్రజలకు పెద్దగా తెలియదు కానీ… ప్రతీ సర్జికల్ స్ట్రైక్ వెనక ఇదే కనిపిస్తుంది!
సైన్యం గనక ఖడ్గం అయితే… NTRO దానికి చూపించే ధిక్కు!