జమ్మూకశ్మీర్లోని పహల్గాం టూరిస్టులపై జరిగిన దారుణ ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చిన ఆపరేషన్ సిందూర్పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సైన్యం చూపిన ధైర్యం, చాకచక్యం దేశమంతటినీ గర్వపడేలా చేసిందని వ్యాఖ్యానించారు.
కేబినెట్ సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ, “ఇది దేశ చరిత్రలో చిరస్మరణీయమైన క్షణం. సైన్యం చేసిన ఈ ఆపరేషన్ దేశ గౌరవాన్ని నిలబెట్టింది” అని తెలిపారు. పుల్వామా తరహాలో జరిగిన ఈ దాడికి భారత త్రివిధ దళాలు సమర్థంగా స్పందించాయన్న విషయాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
दिल्ली: ऑपरेशन सिंदूर के बाद प्रधानमंत्री नरेंद्र मोदी की अध्यक्षता में केंद्रीय मंत्रिमंडल की बैठक हुई।#OperationSindoor #NarendraModi #CabinetMetting #Delhi #PMO #IndianArmedForces #IndianAttackOnPakistan | #Channel24Plus pic.twitter.com/NUT3GwgsdJ
— Channel 24+ News (@Channel24Plus) May 7, 2025
కేబినెట్ సమావేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం బయటకు వచ్చింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీతోపాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. మోదీ ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని చెప్పిన వెంటనే మంత్రివర్గ సభ్యులు టేబుల్ చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు.
ఈ సమావేశం అనంతరం మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నట్టు సమాచారం. దేశ భద్రత పరిస్థితులపై ఆమెకు వివరించనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా, గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. ఈ సమావేశానికి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. హోంమంత్రి అమిత్ షా కూడా హాజరుకానున్నారు.
ఇక ఆపరేషన్ సిందూర్ క్రమంలో భారత సైన్యం పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసింది. ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అత్యంత ప్రమాదకర ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబంలోని 14 మంది సభ్యులు ఈ దాడిలో మృతి చెందినట్టు నివేదికలు చెబుతున్నాయి.