Mallikarjun Kharge: ఆపరేషన్ సింధూర్‌ పై ఖర్గే సంచలన వ్యాఖ్యలు.. ఇది చిన్న యుద్ధం మాత్రమే..!

ఆపరేషన్ సింధూర్‌ను చిన్న యుద్ధంగా అభివర్ణిస్తూ, దానితోనే కేంద్రం తృప్తిపడిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. కర్ణాటకలో జరిగిన ‘సమర్పణ సంకల్ప ర్యాలీ’లో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దేశ భద్రత కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఖర్గే మాట్లాడుతూ, “ప్రధాని కంటే దేశం ముఖ్యమై ఉండాలి. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ప్రధాని పట్ల విధేయతతో వ్యవహరిస్తోంది. బీజేపీ, మోదీకి దేశ భద్రత కన్నా రాజకీయ లాభాలే ముఖ్యం,” అని విమర్శించారు.

ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి, “ఇది చిన్న యుద్ధంలా చేసి, ప్రజలకు గొప్ప విజయంలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ దేశ భద్రతను ఈ స్థాయిలో తేలికగా తీసుకోవడం ప్రమాదకరం,” అని ఖర్గే పేర్కొన్నారు.

పహల్గామ్ ఉగ్రదాడి ముందు ప్రధాని మోదీ కాశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని గుర్తుచేస్తూ, నిఘా సంస్థలు హెచ్చరికలు ఇచ్చినప్పటికీ, ఆ విషయాన్ని ప్రజలకు వెల్లడించకుండా, ఏ చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనం వహించారనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు.

అంతేకాదు, ఆ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, కేంద్రం అలాంటి ఘటనలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైందని ఖర్గే విమర్శించారు. “అలాంటి సున్నిత పరిస్థితుల్లో కాశ్మీర్ పర్యటన రద్దయిన విషయాన్ని పారదర్శకంగా చెప్పాల్సింది బీజేపీ ప్రభుత్వమే,” అని వ్యాఖ్యానించారు.

Leave a Reply