జూన్ 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా కీలక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. డైలీ లావాదేవీలు చేసే వారికి ఇది అలర్ట్. క్రెడిట్ కార్డ్ రూల్స్, ATM ఛార్జీలు, LPG ధరలు, FD వడ్డీ రేట్లు, ఆధార్ అప్డేట్ గడువు వంటి విషయాల్లో కొత్త నిబంధనలు మారుతున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
1. క్రెడిట్ కార్డ్ పై కొత్త నిబంధనలు:
జూన్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ ద్వారా యుటిలిటీ బిల్లులు (పవర్, వాటర్ బిల్లులు), అద్దె, ఇన్సూరెన్స్ చెల్లింపులపై అదనపు ఛార్జీలు వర్తించనున్నాయి.
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫ్యూయల్ చెల్లింపులపై 1% ఛార్జ్ విధించనుంది. అలాగే, ఈ ట్రాన్సాక్షన్లపై రివార్డ్ పాయింట్లు పరిమితం చేయనున్నారు. ఆటో-డెబిట్ విఫలమైతే జరిమానా 2%కు తగ్గే అవకాశం ఉంది. మీ బ్యాంక్ నిబంధనలను ముందుగానే తెలుసుకోండి.
2. ATM విత్డ్రాయలపై అధిక ఛార్జీలు:
బ్యాంకులు తమ ఫ్రీ లిమిట్ దాటి ATM విత్డ్రాయలపై అధిక ఛార్జీలు వసూలు చేయనున్నాయి. జూన్ 1 నుంచి ఈ ఛార్జీలు మారే అవకాశం ఉన్నందున, మీ బ్యాంక్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా వివరాలు తెలుసుకోండి.
3. LPG సిలిండర్ ధరలు మారే అవకాశం:
ప్రతి నెల మొదటి తేదీన లాగే జూన్ 1న కూడా చమురు కంపెనీలు LPG ధరలను సవరించనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్, కరెన్సీ మార్పిడి వాస్థవాల ఆధారంగా ధరలు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.
4. FD వడ్డీ రేట్లలో మార్పులు:
కొన్ని చిన్న బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను జూన్ 1 నుంచి తగ్గించనున్నాయి. ఉదాహరణకు, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 60 బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీ రేట్లు తగ్గించనుంది. ప్రస్తుతం FD రేట్లు 6.5% – 7.5% మధ్యలో ఉన్నాయి.
5. ఆధార్ ఉచిత అప్డేట్ గడువు:
మీ ఆధార్ వివరాలను myAadhaar పోర్టల్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 14, 2025.
ఆ తర్వాత ఆన్లైన్ అప్డేట్కు ₹25, ఆధార్ సెంటర్లలో ₹50 ఛార్జ్ వర్తిస్తుంది.
ఈ మార్పులు సాధారణ వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశముంది. అందువల్ల ముందుగానే తగిన ఏర్పాట్లు చేసుకోవడం ఉత్తమం.