పాకిస్తాన్‌పై గ్యాప్ లేకుండా కొడుతున్న మోదీ.. కేంద్రం మరో కీలక నిర్ణయం!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత ప్రభుత్వం ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందం, దౌత్య సంబంధాలపై పునర్విమర్శ మొదలుపెట్టిన కేంద్రం, ఇప్పుడు వాణిజ్య రంగంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నాడు కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా ఉత్తర్వులతో, పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై సంపూర్ణ నిషేధం విధించినట్లు ప్రకటించింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఈ ఉత్తర్వుల ప్రకారం, పాకిస్తాన్‌ నుండి ఏ రూపంలో వచ్చినా సరే అన్ని వస్తువుల దిగుమతులను నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. విదేశీ వాణిజ్య విధానం (FTP) 2023లో ఈ మార్పులను చేర్చినట్లు అధికారులు పేర్కొన్నారు. జాతీయ భద్రత మరియు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటూ, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఏ దిగుమతికైనా కేంద్రం ప్రత్యేక అనుమతి ఉంటే తప్ప వదిలే అవకాశం లేదని వెల్లడించారు.

ఇప్పటికే పాకిస్తాన్‌తో ఉన్న ఏకైక అధికారిక వాణిజ్య మార్గం అయిన వాఘా-అట్టారి సరిహద్దు గేటు మూసివేయబడిన సంగతి తెలిసిందే. తాజా చర్యలతో పాక్‌కు ఎదురవుతున్న ఆర్ధిక ఒత్తిడి మరింత పెరిగే అవకాశముంది. ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న పాకిస్తాన్‌ను అన్ని కోణాల నుంచి ఒత్తిడికి గురిచేయడమే భారత ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.

Leave a Reply