PM Modi: మహిళలకు మోదీ దసరా గిఫ్ట్.. రూ.10 వేలు నేరుగా ఖాతాల్లోకి!

బీహార్ రాష్ట్రంలో మహిళా సాధికారతను పెంచే లక్ష్యంతో ‘ముఖ్యమంత్రి మహిళా ఉపాధి యోజన’ను ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 26న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.10,000 చొప్పున తొలి విడత ఆర్థిక సాయాన్ని జమ చేస్తున్నారు. మొత్తం రూ.7,500 కోట్లను నేరుగా మహిళలకు బదిలీ చేయనున్నారు.

బీహార్‌లో ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ స్వయం ఉపాధి లేదా జీవనోపాధి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆర్థిక సహాయాన్ని అందించడం ప్రధాన ఉద్దేశ్యం. ఎంపికైన ప్రతి లబ్ధిదారురాలికి రూ.10,000 గ్రాంట్ రూపంలో అందించబడుతుంది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత వారి వ్యాపారం కొనసాగితే రూ.2 లక్షల వరకు అదనపు ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంటుంది.

వ్యవసాయం, పశుపోషణ, హస్తకళలు, కుట్టుపని, నేత వంటి చిన్న తరహా పరిశ్రమల ప్రారంభానికి ఈ సాయం ఉపయోగపడుతుంది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోడల్ ఏజెన్సీగా పర్యవేక్షిస్తుంది. స్వయం సహాయక బృందాలకు అనుసంధానమైన కమ్యూనిటీ వనరుల వ్యక్తులు శిక్షణ, మార్గదర్శకాన్ని అందిస్తారు. 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన మహిళలు, ముఖ్యంగా స్థిర ఆదాయం లేని వారు ఈ పథకానికి అర్హులు. జీవికా స్వయం సహాయక బృంద సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

Leave a Reply