దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్.. మోదీ క్యాబినెట్ కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో, వచ్చే జనాభా లెక్కల్లో కులగణనను చేర్చేందుకు కేంద్రం తుది నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా అనేక పార్టీల నుంచి, సామాజిక న్యాయ ఉద్యమాల నుంచి చాలా కాలంగా వస్తున్న డిమాండ్లకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తమ స్థాయిలో కుల సర్వేలు నిర్వహించినప్పటికీ, అవి పారదర్శకత లేని విధంగా జరిగాయని ఆరోపించారు. రాజకీయ కోణంలో, ఓటు బ్యాంకు లబ్ధి కోసం మాత్రమే ఈ సర్వేలు నిర్వహించబడ్డాయని తెలిపారు. ఇటువంటి అస్పష్టమైన సర్వేలు సమాజంలో అనేక అనుమానాలను, భయాందోళనలను రేకెత్తించాయని చెప్పారు. అందువల్ల, అధికారిక జనాభా గణనలో భాగంగా కులగణనను పారదర్శకంగా నిర్వహించడం ద్వారా సమాజంలోని భిన్న వర్గాల విశ్వాసాన్ని కాపాడతామని కేంద్రం భావిస్తోందని వివరించారు.

కులగణనను జనాభా లెక్కల్లో చేర్చే అంశంపై రాజకీయ వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ సమీక్షించి నిర్ణయం తీసుకుంది. 2010లో మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం కాలంలోనూ ఇదే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా, అప్పట్లో దానిని పూర్తిగా అమలు చేయలేదని మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయాన్ని స్పష్టంగా తీసుకోవడంతో, త్వరలో జరగబోయే జనాభా గణనలో కులాల గణాంకాలు కూడా లెక్కించబోతున్నారు.

అంతేకాక, రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం జనాభా లెక్కల అంశం కేంద్ర జాబితాలో 69వ నంబరులో ఉందని, కాబట్టి ఇది పూర్తిగా కేంద్ర పరిధిలో ఉన్న అంశమని మంత్రి తెలిపారు. కొన్ని రాష్ట్రాలు స్వతంత్రంగా చేసిన కుల ఆధారిత సర్వేలు పరిమిత సమాచారం కలిగి ఉండగా, ఈసారి కేంద్రం చేపట్టబోయే కులగణన పారదర్శకంగా, శాస్త్రీయంగా, ప్రామాణికంగా సాగనుందని చెబుతోంది.

ఈ నిర్ణయం తర్వాత, దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశం ఉంది. బీజేపీ ఈ నిర్ణయాన్ని సామాజిక న్యాయానికి నడకగా పేర్కొంటుండగా, ప్రతిపక్షాలు దీన్ని ఎన్నికల హక్కులను ప్రభావితం చేసే ప్రయత్నంగా విమర్శించవచ్చు. ఏది ఏమైనా, జనాభా గణనలో కులగణన చేర్చడం భారత రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉంది.

Leave a Reply