మిస్ వరల్డ్ 2025 ఫైనల్ ఈవెంట్ కోసం కౌంట్డౌన్ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎలిమినేషన్ రౌండ్స్ అనంతరం, 40 మంది క్వార్టర్ ఫైనలిస్టులు తుది పోరుకు సిద్ధమయ్యారు. ఈ గ్రాండ్ ఫినాలే మే 31న హైదరాబాద్ HITEXలో జరగనుంది. సుమారు 3,500 మంది అతిథులు ఈ అంతర్జాతీయ ఈవెంట్కి హాజరవుతారని అంచనా.
తుది పోరులోకి 40 మంది అందాల భామలు
మిస్ వరల్డ్ ఫైనల్ రౌండ్కు మొత్తం 40 మంది అందాల భామలు అర్హత సాధించారు. వీరిలో ఇప్పటికే 14 మంది వివిధ కేటగిరీల్లో విజయాలతో తమ స్థానాలు ఖాయం చేసుకున్నారు. టాలెంట్ ఛాలెంజ్, స్పోర్ట్స్ ఛాలెంజ్, హెడ్-టు-హెడ్ ఛాలెంజ్, టాప్ మోడల్, బ్యూటీ విత్ ఎ పర్పస్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారు ఈ జాబితాలో ఉన్నారు. మిగతా 26 మంది పోటీదారులను, వారి సామర్థ్యం ఆధారంగా జడ్జీలు ఎంపిక చేస్తారు.
ఫైనల్స్ ఎలా సాగనున్నాయి?
పోటీ విధానం కూడా ప్రత్యేకత కలిగినదే. ప్రాతినిధ్యాన్ని సమతుల్యం చేయడానికి ఖండాల వారీగా ఎంపిక చేస్తారు:
టాప్ 40: ప్రపంచ ఖండాల నుంచి మొత్తం 40 మంది ఎంపిక
టాప్ 20: ఒక్కో ఖండం నుంచి 5 మంది చొప్పున
టాప్ 8: ఒక్కో ఖండం నుంచి 2 మంది చొప్పున
ఫైనల్ 4: ఒక్కో ఖండం నుంచి ఒకరు ఎంపిక చేస్తారు
చివరగా ఈ నలుగురిలో ఒకరికి మిస్ వరల్డ్ కిరీటం దక్కుతుంది. మిగతా ముగ్గురు రన్నర్అప్లుగా నిలుస్తారు.
హైదరాబాద్ వేదికగా రేపే ఫైనల్!
మిస్ వరల్డ్ 2025 ఫైనల్ ఈవెంట్ మే 31న హైదరాబాద్ HITEXలో కొత్తగా నిర్మించిన హాల్ 4లో జరగనుంది. ఈ పోటీ రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సాగనుంది. ఈవెంట్ భద్రతకు సంబంధించి సైబరాబాద్ పోలీస్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, టూరిజం శాఖలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. 3,500 మందికి పైగా ప్రముఖులు, అంతర్జాతీయ అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముంది.