Youtuber Jyoti Malhotra: పాకిస్థాన్ స్పై.. మొత్తం ఆరుగురు అరెస్ట్!

భారత దేశ భద్రతకు భారీ ప్రమాదంగా మారే ఘటన హర్యానాలో వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ గూఢచారులకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్న ఆరోపణలతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా ఆరుగురు వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో వీరి నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

‘Travel with Jo’ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా 2023లో కమీషన్ ఏజెంట్ల సాయంతో పాకిస్థాన్ వెళ్లారు. అక్కడ ఆమె పాక్ హైకమిషన్‌లో పనిచేసిన ఎహ్సాన్-ఉర్-రహీమ్ అలియాస్ దానిష్‌తో సన్నిహితంగా మమేకమయ్యారు. అనంతరం షాహబాజ్ అలియాస్ శాకిర్ అనే పాక్ గూఢచారితో వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ ద్వారా నిరంతరం టచ్‌లో ఉండినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇప్పుడు భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ.. జ్యోతి భారతదేశంలోని సున్నితమైన ప్రాంతాల వివరాలను పాక్ గూఢచారులకు లీక్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. పాకిస్థాన్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం కూడా నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

జ్యోతితో పాటు గుజాలా, బాను నస్రీనా, యామీన్ మహ్మద్, అర్మాన్, దవిందర్ సింగ్ ధిల్లాన్ అనే వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. వీరిలో దవిందర్ పటియాలా సైనిక స్థావరానికి సంబంధించిన వీడియోలను పాక్‌కు పంపించినట్లు తెలిసింది.

జ్యోతి మల్హోత్రాపై భారతీయ న్యాయసంహిత సెక్షన్ 152తో పాటు, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923లోని 3, 4, 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆమె తాను చేసిన పనిని ఒప్పుకొని రాతపూర్వకంగా సమాధానమిచ్చినట్లు సమాచారం.

ఈ కేసు జాతీయ భద్రతకు సంబంధించి అత్యంత సున్నితమైనదిగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Leave a Reply