Indian Army: భారత్ సిద్ధం.. పాక్‌తో యుద్ధానికి సైన్యం రెడీ.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన..!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య ఇప్పుడు యుద్ధం ప్రారంభమయ్యే అవకాశముందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో భారత సైన్యం ఎక్స్‌ (ట్విటర్‌లో) ఓ సంచలన పోస్ట్ చేసింది.

“మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. భయపడేది లేదు.. మమ్మల్ని ఆపే శక్తి ఏదీ లేదు,” అంటూ ఆర్మీ పోస్ట్ చేసింది. దీంట్లో జవాన్లు విన్యాసం చేస్తున్న వీడియోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక తూర్పు నావికాదళం కూడా ఎలాంటి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. దీనిపై తూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ పెందార్కర్ విశాఖపట్నంలో సమీక్ష నిర్వహించారు. సముద్ర మార్గాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని నేవీ సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లలో పనిచేస్తున్న సిబ్బందికి సెలవులను రద్దు చేసినట్లు సమాచారం. తూర్పు తీర ప్రాంతాల్లో భద్రతా బలగాల కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇక అరేబియా సముద్రంలో భారత నౌకాదళం మోహరించిన అత్యాధునిక ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’ ప్రాధాన్యతను సంతరించుకుంది. సముద్ర మార్గాల్లో భారత శక్తిని చాటిచెప్పేందుకు విక్రాంత్ మోహరించడం కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.

Leave a Reply