15 ఏళ్ల విరామం తర్వాత భారత్లో జనగణన (Census) ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. స్వాతంత్య్రానంతరం నిర్వహించనున్న ఇది ఎనిమిదవ జనగణన కాగా, మొత్తం 16వ జనగణనగా పరిగణించనున్నారు.
ఈసారి జనగణన రెండు దశల్లో నిర్వహించనున్నారు. హిమాలయ ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో మొదటి దశ 2026, అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. రెండో దశ 2027, మార్చి 1 నాటికి పూర్తవుతుంది.
ఒకింత వినూత్నంగా ఈసారి జనగణనలో తొలిసారి కుల గణన కూడా జరుగనుంది. దీనికోసం 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, అలాగే 1.34 లక్షల మంది సహాయక సిబ్బంది పనిచేయనున్నారు. ఈ గణాంక సేకరణ పూర్తిగా డిజిటల్ విధానంలో ట్యాబ్లెట్ల సాయంతో జరుగుతుందని హోంశాఖ తెలిపింది. ప్రజలు స్వయంగా తమ సమాచారం నమోదు చేసుకునేలా ప్రభుత్వ పోర్టల్స్, మొబైల్ యాప్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
📢 Central Government issues notification for Census
🗓️ Census to be conducted in March 2027
📊 This will be India’s 16th national Census & 8th since Independence. #census2027 pic.twitter.com/Z5bKntBATO
— All India Radio News (@airnewsalerts) June 16, 2025
డేటా భద్రత కోసం కఠిన నిబంధనలు తీసుకురావడం ద్వారా సమాచార సేకరణ, నిల్వ, బదిలీ ప్రక్రియను అత్యంత పటిష్టంగా నిర్వహించనున్నారు. జనగణన చట్టం 1948 లోని సెక్షన్ 3 ప్రకారం ఈ జన-కుల గణన కొనసాగనుంది.
గతసారి దేశవ్యాప్తంగా జనగణన 2011లో జరిగింది. 2021లో నిర్వహించాల్సిన ఈ ప్రక్రియ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత మళ్లీ జనగణన నిర్వహించడంతో పాటు, తొలిసారిగా కులగణనకు శ్రీకారం చుట్టడం విశేషం. కేంద్రం గత నెలలో దేశవ్యాప్తంగా జనాభా గణనతో పాటు కుల గణనను కూడ చేపట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఇక జనగణన ఫారంలో ఈసారి 30కి పైగా ప్రశ్నలు ఉండనున్నాయని, అందులో ముఖ్యమైనది “మీ కులం ఏంటి?” అనే ప్రశ్న కూడా ఉంటుందని తెలిసింది. ఇప్పటి వరకు దేశంలోని జనగణన చరిత్రలో.. 1931 తర్వాత కులగణనకు ఇంతటి స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వడం ఇదే తొలిసారి.