దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాంబు పేలుళ్ల కుట్ర కేసులో విచారణ చేస్తోన్న పోలీసులు ఆందోళనకరమైన వివరాలను బయటపెట్టారు. కస్టడీలో ఉన్న నిందితులు సిరాజ్ మరియు సమీర్ ఇటీవల పోలీసులకు కీలక సమాచారం అందించారు. ఈ ఇద్దరూ దేశంలోని డిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, విజయనగరం సహా ఏడు ప్రధాన నగరాల్లో పేలుళ్లు జరిపేందుకు పథకం రచించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
హైదరాబాద్లోనే కుట్ర ఆరంభం
గత ఆరు నెలలుగా విజయనగరానికి చెందిన సిరాజ్, సమీర్తో కలిసి హైదరాబాద్లో నివాసం ఉంటూ, అక్కడే ఈ కుట్రను పన్నినట్లు పోలీసులు గుర్తించారు. విదేశాల్లోని ఉగ్రవాద ముఠాలతో వీరికి సంబంధాలున్నట్లు సమాచారం. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఒమాన్ వంటి దేశాల్లో ఉన్న ముఠాలతో వీరు సంప్రదింపులు జరిపినట్లు విచారణలో తేలింది.
వాట్సాప్ గ్రూప్లో పేలుళ్ల చర్చ
వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫర్హాన్ (వరంగల్), బాదర్ (ఢిల్లీ), రహీం తదితరులతో “అలీం” అనే పేరుతో వాడే వాట్సాప్ గ్రూప్లో చురుగ్గా చాటింగ్ జరిపినట్లు పోలీసులు గుర్తించారు. పేలుళ్ల కోసం టార్గెట్గా ముస్లిమేతరులను ఎంచుకున్నట్లు సమాచారం. ఈ కుట్రలో పాత్రదారుల సంబంధాలు, ఆర్ధిక సహకారాలు తెలుసుకునేందుకు విజయనగరం పోలీసులు ఇప్పటికే స్పెషల్ టీమ్లను రంగంలోకి దించారు.
పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది
విచారణ క్రమంలో రోజంతా నిందితులను పీటీసీ కేంద్రంలో విచారించిన పోలీసులు, మరిన్ని ఆధారాలు సేకరించేందుకు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగగా, మళ్లీ సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రివరకు విచారణ కొనసాగింది.