అంతరిక్షంలో చరిత్రాత్మక దృశ్యం ఆవిష్కృతమైంది. అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ISS)తో ఫాల్కన్-9 వ్యోమనౌక విజయవంతంగా డాకింగ్ చేయడంలో సఫలమైంది. బుధవారం (జూన్ 25) నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ప్రయాణించిన యాక్సియం-4 మిషన్లో భారతీయుడు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా కీలక భాగస్వామిగా ఉన్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు అంతరిక్షయాత్రికులు ఈ ప్రయాణంలో పాల్గొన్నారు.
అంతరిక్షంలో అడుగుపెట్టిన వెంటనే శుభాంశు శుక్లా “జై హింద్.. జై భారత్” అని గర్వంగా సందేశం పంపారు. ISSలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచిన శుక్లాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.
శుభాంశు శుక్లా మాట్లాడుతూ – “నా భుజాలపై త్రివర్ణ పతాకం ఉంది. సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాం. ఇది అద్భుతమైన అనుభవం. ప్రతి భారతీయుని ఆశీస్సులు కావాలి,” అని అన్నారు. ఈ మిషన్లో ఆయన వివిధ శాస్త్రీయ ప్రయోగాలు చేయనున్నారు. అంతరిక్షంలో 14 రోజులు గడపనున్నారు.
Watch Dragon and the Ax-4 astronauts dock with the @Space_Station https://t.co/ObPHodyVlf
— SpaceX (@SpaceX) June 26, 2025
ప్రయాణం మొదలుపెట్టే ముందు ఆయన ఓ వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ – “ఇది భారతీయ మానవ అంతరిక్ష కార్యక్రమానికి చిన్న కానీ దృఢమైన అడుగు. ఇక్కడ నేను పిల్లవాడిలా తినడం, త్రాగడం, నడవడం నేర్చుకుంటున్నాను. ఎక్కువగా నిద్రపోతున్నాను కూడా,” అంటూ నవ్వుతూ పేర్కొన్నారు.
ఈ మిషన్ను భారత వైమానిక దళం చారిత్రాత్మకంగా పేర్కొంది. 1983లో స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ తర్వాత 41 ఏళ్ల గ్యాప్లో మరో భారతీయుడు అంతరిక్షంలోకి అడుగుపెట్టడం గర్వకారణం అని వ్యాఖ్యానించింది.
ఈ మిషన్లో భారతదేశంతో పాటు నాలుగు దేశాల ప్రతినిధులు పాల్గొనడం విశేషం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ – “ఇది కేవలం అంతరిక్ష మిషన్ మాత్రమే కాదు, దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటే ఘట్టం,” అని కొనియాడారు.