ప్రధాన నగరాల్లో ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులు వినియోగదారులపై అధిక ఛార్జీలు విధిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా “సహకార్ ట్యాక్సీ” అనే కొత్త యాప్ను ప్రారంభించనుంది. సహకార సంఘాల ఆధ్వర్యంలో పనిచేసే ఈ యాప్ ద్వారా డ్రైవర్లు నేరుగా ప్రయోజనం పొందేలా ప్రభుత్వ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. క్యాబ్ డ్రైవర్లకు ఎక్కువ ఆదాయం అందించడమే కాకుండా, ప్రయాణికులకు కూడా తక్కువ ధరల్లో ప్రయాణ సౌకర్యం అందించేందుకు ఈ కొత్త యాప్ను రూపొందించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రకటించారు. ఇప్పటికే మూడున్నర సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్పై పరిశీలనలు జరుగుతున్నాయని, త్వరలోనే ఇది దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుందని వెల్లడించారు.
ప్రస్తుత క్యాబ్ సేవలలో ఓలా, ఉబర్ లాంటి సంస్థలు వినియోగదారుల నుండి అధిక రుసుములు వసూలు చేస్తున్నప్పటికీ, డ్రైవర్లకు అందించే మొత్తంలో భారీ కోత విధిస్తున్నాయని తీవ్ర విమర్శలు ఉన్నాయి. ప్రయాణికుల డిమాండ్ పెరిగినప్పుడల్లా ధరలు పెంచుతూ, డ్రైవర్లకు తక్కువ మొత్తమే అందించడం వల్ల అనేక మంది క్యాబ్ డ్రైవర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా సహకార్ ట్యాక్సీ మోడల్ను రూపొందించిన ప్రభుత్వం, డ్రైవర్లు స్వయంగా తమ వాహనాలను రిజిస్టర్ చేసుకుని ప్రయోజనం పొందేలా వ్యవస్థను రూపొందించింది. ద్విచక్ర వాహనాలు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు అన్నీ ఇందులో భాగస్వామ్యం కానున్నాయి. ప్రభుత్వం నేరుగా పర్యవేక్షించే ఈ ప్లాట్ఫారమ్ ద్వారా ప్రయాణికులు తక్కువ ఛార్జీలకు ప్రయాణించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Sounds Interesting! Hopefully, this may give relief from annoying cancellations by the drivers.
Govt to launch a Cooperative taxi services like Ola and Uber, but the benefits will go directly to drivers.
— Nilesh Mishra (@i_mnilesh) March 26, 2025
ఇటీవల, ఐఫోన్ వినియోగదారులకు ఎక్కువ ఛార్జీలు విధిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో, కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (CCPA) ఓలా, ఉబెర్లకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను రెండు కంపెనీలు ఖండించినప్పటికీ, ప్రయాణ ఛార్జీల విషయంలో అవి అనుసరించే విధానాలు అనేక ప్రశ్నలను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త సహకార్ యాప్ ప్రవేశం ఒత్తిడిని మరింత పెంచేలా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ యాప్ వృద్ధితో ప్రైవేట్ క్యాబ్ సంస్థలు రేట్లను తగ్గించే అవకాశం ఉండటంతో, ప్రయాణికులకు ఇది లాభదాయకంగా మారనుంది. మరికొన్ని నెలల్లో ఈ కొత్త యాప్ అందుబాటులోకి రానుండటంతో, క్యాబ్ మార్కెట్లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.