దేశంలో వైద్య విద్యను బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, పోస్ట్గ్రాడ్యుయేట్ (పీజీ) మరియు అండర్గ్రాడ్యుయేట్ (యూజీ/ఎంబీబీఎస్) సీట్ల సామర్థ్యాన్ని పెంచడానికి ఆమోదం తెలిపారు.
కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం, దేశవ్యాప్తంగా మొత్తం 5,000 కొత్త పీజీ సీట్లను, 5,023 అదనపు ఎంబీబీఎస్ సీట్లను పెంచనున్నారు. ఈ పెంపుదల సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ (CSS) ఫేజ్-III కింద అమలు చేయబడుతుంది. ప్రతి సీటుకు రూ. 1.50 కోట్ల వరకు నిధులు కేటాయించబడతాయి. దీని ద్వారా వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆధునిక సాంకేతికత అందుబాటులోకి తీసుకురావడం, బోధనా సిబ్బందిని నియమించడం వంటివి జరుగుతాయి.
ఈ పథకం కోసం 2025-26 నుండి 2028-29 వరకు మొత్తం రూ. 15,034.50 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ. 10,303.20 కోట్లు, రాష్ట్రాలు రూ. 4,731.30 కోట్లు భరిస్తాయి.
ఈ నిర్ణయం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు దేశంలోనే ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. దేశంలో వైద్యులు, స్పెషలిస్ట్ డాక్టర్లు పెరుగుతారు. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలు మెరుగుపడతాయి. వైద్యులు, ప్రొఫెసర్లు, పరిశోధకులు, పారామెడికల్ సిబ్బంది వంటి వారికి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.
ఇంకా, రైల్వే ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక ప్రకటించింది. గ్రూప్-C, గ్రూప్-D ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇవ్వనున్నారు. దీని కోసం రూ. 1,866 కోట్లు కేటాయించబడ్డాయి. ఇది మొత్తం 10.61 లక్షల ఉద్యోగులకు ప్రయోజనం కలిగిస్తుంది. బోనస్ సాధారణంగా దసరా/దుర్గాపూజ పండుగలకు ముందు చెల్లించబడుతుంది.
ప్రభుత్వం ఈ బోనస్ ద్వారా రైల్వే ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకతను ప్రోత్సహించనుంది. అయితే, 6వ వేతన సంఘం ప్రకారం రూ. 7,000 ప్రాతిపదికన బోనస్ లెక్కింపు వల్ల కొన్ని ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. 7వ వేతన సంఘం ప్రకారం కనీస వేతనం రూ. 18,000గా ఉందని, దానిపై బోనస్ లెక్కించాలని డిమాండ్ చేశారు. కానీ, ప్రభుత్వం పాత విధానాన్ని కొనసాగించింది.