తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) – అన్నాడీఎంకే (AIADMK) మళ్లీ కలిశాయి. గతంలో ఎన్నో విజయాలు అందుకున్న ఈ పొత్తు మరోసారి నడిచే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ సమావేశంలో అమిత్ షాతో పాటు అన్నాడీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎడప్పాడి పళనిస్వామి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోనే ఎన్డీఏ (NDA) కూటమి పోటీ చేస్తుందని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎడప్పాడి పళనిస్వామి పేరును ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు.
ఈ పొత్తులో ఎలాంటి షరతులు లేవని, పరస్పర అంగీకారంతో ముందుకెళ్తున్నామని ఆయన తెలిపారు. అధికార పంపకం, సీట్ల కేటాయింపులపై త్వరలో రెండు పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతాయని చెప్పారు. అంతేకాకుండా, అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకోదని స్పష్టంచేశారు.
#WATCH | Chennai, Tamil Nadu: On BJP-AIADMK alliance for Tamil Nadu Vidhan Sabha elections, Union Home Minister Amit Shah says, “Seat distribution and the distribution of ministries after the government is formed, both will be decided later… In Tamil Nadu, the DMK is bringing… pic.twitter.com/wn0j1eyhZt
— ANI (@ANI) April 11, 2025
గతంలో దివంగత జయలలిత నేతృత్వంలో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు 1988లో భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో 39 లోక్సభ సీట్లలో 30 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించాయి. ఇప్పుడు కూడా ఆ విజయాన్ని తిరిగి కైవసం చేసుకోవాలన్నదే ఉద్దేశమని అమిత్ షా ధీమాగా చెప్పారు.
ఇదే సమయంలో డీఎంకే ప్రభుత్వం పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు ఈ పొత్తు కీలకంగా మారనుంది. తాము కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఈ పొత్తుతో తమిళ రాజకీయాల్లో మళ్లీ రాజకీయ వేడి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ వ్యూహాత్మకంగా ముందు అడుగులు వేస్తుండగా, డీఎంకే దీనిపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.