ఐపీఎల్లో వినూత్నంగా పరిచయం చేసిన రోబో కుక్క ఇప్పుడు బీసీసీఐకు పెద్ద సమస్యగా మారింది. ‘చంపక్’ అనే పేరుతో గుర్తింపు పొందిన ఆ రోబో డాగ్ ఇప్పుడు ట్రేడ్మార్క్ వివాదంలో ఇరుక్కుంది. ఈ పేరుపై అభ్యంతరం చెప్పిన ప్రముఖ బాలల పత్రిక ‘చంపక్’ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి రూ.2 కోట్ల పరువునష్టం వసూలు చేయాలని కేసు వేసింది.
ఐపీఎల్ 2025లో, టాస్ సమయంలో కెప్టెన్లతో పాటు మైదానంలోకి ప్రవేశించిన రోబో డాగ్ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. అయితే, ఏప్రిల్ 20న నిర్వహించిన ఓ ఓటింగ్లో ఈ రోబోకు ‘చంపక్’ అనే పేరు ఖరారు చేశారు. కానీ అదే పేరుతో గత 50 సంవత్సరాలుగా బాలల కోసం మ్యాగజైన్ ప్రచురిస్తున్న ఢిల్లీ ప్రెస్ పేపర్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఆ సంస్థ ప్రతినిధులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో, తమ ట్రేడ్మార్క్ పేరును బీసీసీఐ అనుమతి లేకుండా వాడిందని, దీని వల్ల తమ బ్రాండ్ పరువు దెబ్బతిందని పేర్కొన్నారు. దీంతో జస్టిస్ సౌరభ్ బెనర్జీ బీసీసీఐకి నోటీసులు జారీ చేయగా, నాలుగు వారాల్లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. తదుపరి విచారణ జూలై 9న జరగనుంది.
ఈ వివాదం నేపథ్యంలో బీసీసీఐకి నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. క్రియేటివ్ ప్రమోషన్గా ప్రారంభించిన చంపక్ రోబో ఇప్పుడు లీగల్ సమస్యల్లో చిక్కుకుంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుందనేది ఆసక్తికరం.