ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. డిప్యూటీ కలెక్టర్లకు ఈమెయిల్ ద్వారా పేలుడు ఘటన జరగబోతుందని హెచ్చరించిన విషయం కలకలం రేపుతోంది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది.
ఈమెయిల్స్ తమిళనాడు ప్రాంతం నుంచి పంపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ బెదిరింపుల్లో రామమందిరంతో పాటు అలీఘర్ కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా పేల్చేస్తామనే విషయాలు ఉన్నట్లు సమాచారం. దీంతో సంబంధిత ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
అలీఘర్ కలెక్టరేట్ వద్ద డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్స్ సహాయంతో పోలీసు దళాలు పరిశీలన చేపట్టాయి. కార్యాలయ ప్రాంగణాన్ని ఖాళీ చేయించడంతో పాటు అన్ని ద్వారాలను మూసివేశారు.
#BREAKING | The Uttar Pradesh police have tightened security across #Ayodhya after the Shri Ram Janmbhoomi Teerth Kshetra Trust received a bomb threat via email.#UttarPradesh #BombThreat pic.twitter.com/e9SR3VPKfv
— News9 (@News9Tweets) April 15, 2025
ఇది తొలి బెదిరింపు కాదు. గత సోమవారం రాత్రి శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్కు కూడా మెయిల్స్ వచ్చాయి. అధికారుల స్పందనతో భద్రత మరింత గట్టిగా పెట్టారు. అయోధ్య, బారాబంకి, ఇతర సమీప జిల్లాలు హై అలర్ట్లోకి వెళ్లాయి.
రామాలయం వద్ద భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే 2024లో 135 మిలియన్లకు పైగా సందర్శకులు వచ్చారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా సందర్శించబడే పర్యాటక స్థలంగా అయోధ్య రామమందిరం తిరుగులేని స్థానం సంపాదించుకుంది.
ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించిన అధికారులు, రామాలయం చుట్టూ నాలుగు కిలోమీటర్ల భద్రతా గోడ నిర్మాణాన్ని చేపట్టారు. దీన్ని 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలోనూ సోషల్ మీడియా ద్వారా వచ్చిన బెదిరింపులపై పోలీసులు చర్యలు తీసుకొని నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.