ఉగ్రదాడిపై కేంద్రం సీరియస్: ఉగ్రవాదులను కఠినంగా శిక్షిస్తాం.. అమిత్ షా

జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో స్పందించారు. అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.

“ఇది మోదీ ప్రభుత్వ కాలం.. ప్రతి ఉగ్రవాదిని అంతమొందిస్తాం”

ఉగ్రవాదులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కేంద్రం సంకల్పించిందని తెలిపారు. “పహల్గామ్ దాడి చేసిన ఉగ్రవాదులు దాన్ని విజయంగా భావిస్తే అది వారి మూర్ఖత్వమే. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు,” అంటూ స్పష్టమైన సందేశం ఇచ్చారు అమిత్ షా.

భారత్ తరపున గట్టి పోరాటం

“దేశంలోని ప్రతి మూలనుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే మా లక్ష్యం. ఈ పోరాటంలో 140 కోట్ల మంది భారతీయులు మాత్రమే కాదు.. ప్రపంచం అంతా మనతో ఉంది,” అని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటం చివరి దాకా కొనసాగుతుందని, దాడులకు పాల్పడినవారిని ఖచ్చితంగా శిక్షిస్తామని తెలిపారు.

ఘటన నేపథ్యం

ఏప్రిల్ 22న అనంత్‌నాగ్‌లో జరిగిన ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బోడో నేత ఉపేంద్రనాథ్ బ్రహ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply