గత 48 గంటల్లో ఎయిరిండియాకు చెందిన మొత్తం 9 విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు సమాచారం. కొన్ని ఫ్లైట్లు రద్దవ్వగా, మరికొన్నింటికి ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ కూడా అయ్యాయి.
ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్ వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదం నింపింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురై 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత విమాన ప్రయాణాల పట్ల ప్రజల్లో భయం పెరిగిపోయింది.
ఇందులో భాగంగానే సోమవారం చైనాలోని హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్లు అప్రమత్తమై విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. ప్రయాణికులను దింపిన తరువాత అధికారులు పూర్తి తనిఖీలు చేపట్టారు.
మంగళవారం కూడా ఎయిరిండియాకు చెందిన పలు ఫ్లైట్లు సాంకేతిక సమస్యల కారణంగా రద్దయ్యాయి. ఢిల్లీ-పారిస్, అహ్మదాబాద్-లండన్, లండన్-అమృత్సర్ మార్గాల్లో ప్లానైన విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయి. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబయికి వస్తున్న విమానం సాంకేతిక లోపం కారణంగా కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది.
WILL THEY STILL PRETEND ALL’S WELL?
Here’s a list of Air India flight cancellations / Emergency landing in the last 48 hours•Air India San Francisco → Kolkata → Mumbai deplaned
•Flight AI159 from Ahmedabad to Gatwick has been cancelled
•Flight AI170 from London Gatwick to… pic.twitter.com/Qzu3aDbXUH— Rahul Shivshankar (@RShivshankar) June 17, 2025
ఇక జూన్ 18న పారిస్ నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానాన్ని రద్దు చేయగా, ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో నడవాల్సిన మరో విమాన సేవ కూడా నిలిపేశారు. ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి వచ్చేసింది. ఫుకెట్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న విమానం కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో తమ విమానాల్లో తలెత్తిన సాంకేతిక లోపాలపై విచారణ జరుపుతున్నామని, రద్దైన సేవలకు సంబంధించి ప్రయాణికులకు టికెట్ రిఫండ్ చేస్తామని ఎయిరిండియా ప్రకటించింది.
ఇటీవల ఎయిరిండియాలో ఇలా వరుసగా తలెత్తుతున్న సాంకేతిక లోపాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఫయాజ్ ఎయిరిండియా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం డీజీసీఏ కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందిస్తున్నట్టు తెలుస్తోంది.
దీనివల్ల దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులలో భయం నెలకొంది. ముఖ్యంగా ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించేందుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. దీంతో “ఎయిరిండియాకు అసలేం జరుగుతోంది?” అనే ప్రశ్నలతో సోషల్ మీడియా వేడెక్కుతుంది.