Air India Crash: ఎలా బతికి బయటపడ్డానో ఇప్పటికీ అర్థం కావడం లేదు.. ప్రధాని మోదీతో రమేష్..!

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ప్రపంచాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ భయానక ఘటనలో ఇప్పటిదాకా 265 మంది మరణించారు. అయితే ఈ ఘోర ప్రమాదం నుంచి అద్భుతంగా ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి రమేష్. ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్‌ను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు.

ఈ సందర్భంగా మోదీ రమేష్‌తో మాట్లాడారు. రమేష్ కూడా ఎంతో భావోద్వేగంగా స్పందించారు. “ఇప్పటికీ నమ్మలేకపోతున్నా సార్.. ఎలా బతికానో తెలియట్లేదు. ప్రమాదం క్షణాల్లో జరిగిపోయింది. విమానం నేలతాకిన తర్వాత రెండు ముక్కలైంది. నేను కూర్చున్న 11A సీటు ఏదోలా కాస్త దూరానికి విసిరిపడింది. దాని వల్లనే నాకు ప్రాణాలు బతికాయి” అని అన్నారు.

ఘటన సమయంలో తనకు ఏదో జరగబోతుందని గమనించానని రమేష్ చెప్పాడు. “విమానం కిందపడుతోందని అర్థమైంది. అప్పుడే సీటు బెల్ట్‌ను నెమ్మదిగా తీసేసి, నా దగ్గర కనిపించిన ఓ సందు ద్వారా బయటకు పాకుకుంటూ వచ్చా. చుట్టూ ఉన్నవాళ్లంతా మృతులయ్యారు. నేను ఏదో అద్భుతంగా బయటపడ్డానన్న భావన ఉంది. బయటకు వచ్చాక అరుపులు వినిపించాయి. ఆ గందరగోళంలోనే దగ్గరలో ఉన్న అంబులెన్స్‌ ఎక్కాను” అని వివరించారు.

40 ఏళ్ల బ్రిటిష్ పౌరుడైన రమేష్ విశ్వాస్ కుమార్ ఈ సంఘటనపై మాట్లాడుతూ, తన సీటు పడిన చోటే బయటకు రాస్కోవటానికి మార్గం ఉండటం తాను బతకడానికి అసలు కారణమని చెప్పారు.

ప్రమాద అనంతరం ప్రధాని మోదీ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. వారందరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంఘటన స్థలానికి వెళ్లిన మోదీ, ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. “ఈ విపత్తుతో తమ ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాల బాధను ఊహించలేను. అధికారులు అవిశ్రాంతంగా కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది” అంటూ ప్రధాని అన్నారు.

Leave a Reply