దేశవ్యాప్తంగా ఎయిర్ కండిషనర్ల (AC) వినియోగానికి కొత్త నిబంధనలు రానున్నాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ఈ మార్గదర్శకాలను తీసుకువచ్చే యోచనలో కేంద్రం ఉంది. విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తాజాగా ఈ విషయాన్ని ప్రకటించారు. నూతన నియమాల ప్రకారం, ఎయిర్ కండిషనర్లు కేవలం 20 డిగ్రీల నుంచి 28 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే ఉష్ణోగ్రతను అందించగలగాలి. అంటే ఇకపై 20 డిగ్రీల కంటే తక్కువకూ, 28 డిగ్రీల కంటే ఎక్కువకూ AC ఉష్ణోగ్రతలను సెట్ చేయలేరు.
ఎందుకు ఈ కొత్త నిబంధనలు?
ACల వలన భారీగా విద్యుత్ వినియోగం జరుగుతోంది. వేడి ప్రాంతాల్లో చాలామంది తమ ఏసీలను 18-19 డిగ్రీల వరకు తక్కువగా సెట్ చేస్తున్న దృష్ట్యా, విద్యుత్ ఆదా లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రకారం, 23-24 డిగ్రీల సెల్సియస్ ఒక వ్యక్తికి శారీరకంగా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే ఈ మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.
#WATCH | Delhi: Union Minister of Housing & Urban Affairs, Manohar Lal Khattar says, “Regarding air conditioning standards, a new provision is being implemented soon. The temperature standardization for ACs will be set between 20°C to 28°C, meaning we won’t be able to cool below… pic.twitter.com/Iwnaa4ZPKN
— ANI (@ANI) June 10, 2025
ఇతర దేశాల్లో ఏసీ నిబంధనలు ఎలా ఉన్నాయి?
జపాన్: ప్రభుత్వ కార్యాలయాల్లో AC టెంపరేచర్ను 28 డిగ్రీలుగా ఫిక్స్ చేశారు.
అమెరికా: ఇళ్లలో 26 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచాలని సూచన.
సింగపూర్, ఆస్ట్రేలియా: 24-26 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉండాలన్న మార్గదర్శకాలు ఉన్నాయి.
స్పెయిన్: వేసవిలో AC 27 డిగ్రీల కంటే తక్కువగా ఉండకూడదు; శీతాకాలంలో 19 డిగ్రీల కంటే ఎక్కువ ఉండకూడదు.
విద్యుత్ పొదుపు ఎంత?
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) అంచనాల ప్రకారం, ఉష్ణోగ్రతను 20-24 డిగ్రీల మధ్య సెట్ చేస్తే సగటున 26% విద్యుత్ పొదుపు చేయవచ్చని చెబుతోంది. ప్రతి డిగ్రీ పెరిగినకొద్దీ విద్యుత్ పొదుపు కూడా 6% పెరుగుతుంది.
మొత్తం మీద.. కేంద్రం తీసుకొచ్చే ఈ కొత్త నిబంధనలు ఒకవైపు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి దోహదం చేస్తే.. మరోవైపు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడతాయని నిపుణులు భావిస్తున్నారు.