Sunita Williams: 286 రోజులు అంతరిక్షంలో.. భూమికి సురక్షితంగా తిరిగి సునీతా విలియమ్స్

భారత సంతతికి చెందిన ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ 286 రోజుల పాటు అంతరిక్షంలో గడిపి, సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఆమెతో పాటు వ్యోమగామి బ్యారీ విల్మోర్ కూడా ఈ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో వీరి ల్యాండింగ్ పూర్తయింది.

భారత కాలమానం ప్రకారం తెల్లవారు జామున 3:27 గంటలకు స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ క్రూ-9 ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ వద్ద విజయవంతంగా ల్యాండ్ అయింది. అక్కడి నుంచి ఇద్దరినీ టెక్సాస్‌లోని హ్యూస్టన్ లో ఉన్న నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించి, 45 రోజుల పాటు రిహాబిలిటేషన్‌లో ఉంచనున్నారు.

ఫ్లోరిడా సముద్ర తీరంలో స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ నేరుగా నీటిలో దిగింది. లక్షలాది మంది NASA యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ ఘటనను వీక్షించారు. భూమి వాతావరణంలోకి ప్రవేశించిన కొద్ది నిమిషాల్లోనే, సాయంత్రం 5:57 గంటలకు (ఈస్టర్న్ టైమ్ జోన్) క్యాప్సూల్ సురక్షితంగా సముద్రంలో దిగింది. NASA కంట్రోల్ రూమ్‌లో విజయం జరుపుకుంటూ హర్షధ్వానాలు మారుమ్రోగాయి.

ఈ ప్రయాణంలో సునీతా విలియమ్స్, బ్యారీ విల్మోర్‌తో పాటు నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఉన్నారు. భూ కక్ష్యలోకి తిరిగి ప్రవేశించే సమయంలో కొద్ది సేపు కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ ఏర్పడినప్పటికీ, NASA క్షణాల్లోనే దీన్ని పునరుద్ధరించింది. క్యాప్సూల్ తెరిచిన వెంటనే, నలుగురు వ్యోమగాములు చిరునవ్వుతో చేతులు ఊపి, “థమ్స్ అప్” సంకేతం ఇచ్చారు. అనంతరం వారిని హ్యూస్టన్‌కు తరలించారు.

286 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన అతి కొద్ది మంది వ్యోమగాములలో సునీతా విలియమ్స్ ఒకరు. ఇప్పటి వరకు దీర్ఘకాలం అంతరిక్షంలో గడిపిన వ్యక్తుల్లో ఫ్రాంక్ రూబియో (371 రోజులు) మరియు రష్యన్ వ్యోమగామి వాలెరి పోల్యాకోవ్ (437 రోజులు, మిర్ అంతరిక్ష కేంద్రం) ప్రసిద్ధులు. ఈ మిషన్ ద్వారా సునీతా విలియమ్స్ మరో అరుదైన ఘనత సాధించారు.

Leave a Reply