Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత: అధికారికంగా ప్రకటించిన వాటికన్ సిటీ..!

కేథలిక్ మత ప్రపంచానికి విషాద వార్త. ప్రపంచ కేథలిక్కుల మత నాయకుడు, అత్యున్నత ఆధ్యాత్మిక గురువు పోప్ ఫ్రాన్సిస్ (88) ఇక లేరు. గత కొన్ని రోజులుగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, సోమవారం ఉదయం 7.35కి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం గురించి వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది.

ఆదివారం జరిగిన ఈస్టర్ వేడుకల్లో పోప్ ఆరోగ్య సమస్యల కారణంగా పాల్గొనలేకపోయారు. మరుసటి రోజే ఆయన కన్నుమూయడం అభిమానులను తీవ్ర విషాదంలో ముంచింది. వాటికన్ కామెరెంగో కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ మాట్లాడుతూ, “పోప్ తన జీవితాన్ని పూర్తిగా చర్చ్ సేవకే అంకితం చేశారు” అని స్పందించారు.

గత కొన్ని నెలలుగా పోప్ ఫ్రాన్సిస్ శ్వాసకోస సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సంబంధిత ఆరోగ్యపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఫిబ్రవరి 14న ఆసుపత్రిలో చేరిన ఆయన, 38 రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత మార్చిలో డిశ్చార్జి అయ్యారు. ఈ క్రమంలో ఆరోగ్య స్థితి క్రమంగా దిగజారింది.

పోప్ ఫ్రాన్సిస్ 1938లో అర్జెంటీనాలో జన్మించారు. దక్షిణ అమెరికా నుంచి పోప్ పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారు. 2013లో 16వ పోప్ బెనిడిక్ట్ పదవికి రాజీనామా చేసిన తర్వాత, పోప్ ఫ్రాన్సిస్ బాధ్యతలు చేపట్టారు.

సామాజిక అంశాలపై స్పందించే పోప్‌గా ఆయనకు “ప్రజల పోప్” అనే పేరుంది. 2016లో రోమ్ బయట వివిధ మతాలకు చెందిన శరణార్థుల పాదాలను తాను స్వయంగా కడిగారు. ఇది ఆయన వినయానికి, సేవాభావానికి ప్రతీకగా మారింది.

తన మరణానికి కొన్ని గంటల ముందు కూడా పోప్ భక్తుల కోసం సందేశం ఇచ్చారు. వాటికన్‌లోని పీటర్స్ స్క్వేర్‌లో సుమారు 35 వేల మంది ముందు “హ్యాపీ ఈస్టర్” అని సంబోధించారు. అనంతరం తన సందేశాన్ని ఆర్చి బిషప్ డియాగో రావెలి చదివారు.

ఆ సందేశంలో పోప్, “గాజా, ఉక్రెయిన్, కాంగో, మయన్మార్‌లలో శాంతి నెలకొనాలి” అని ఆకాంక్షించారు. పోప్ చివరి వరకూ మానవత్వం, శాంతి కోసం కృషి చేస్తూనే ఉన్నారు.

పోప్ ఫ్రాన్సిస్ మృతి కేథలిక్ మతంలోనే కాదు, మొత్తం ప్రపంచ ఆధ్యాత్మిక రంగానికీ పెద్ద లోటుగా భావిస్తున్నారు. ప్రపంచ నలుమూలల నుండి శ్రద్ధాంజలిలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply