29 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ నిర్వహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పీసీబీ దాదాపు రూ.800 కోట్ల నష్టాన్ని చవిచూసింది, ఇది 85% ఆర్థిక నష్టాన్ని సూచిస్తోంది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాక్ జట్టుకు మైదానంలోనే కాదు, ఆర్థికపరంగా కూడా భయంకరమైన ఓటమిని తెచ్చిపెట్టింది. కేవలం 5 రోజుల్లోనే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. న్యూజిలాండ్, భారత్ చేతిలో ఓడిపోగా, బంగ్లాదేశ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
ఐసీసీ టోర్నమెంట్ నిర్వహించడం వల్ల బిలియన్ల రూపాయలు లాభపడతామని ఆశించిన పాకిస్తాన్, అంచనాలకు పూర్తి విరుద్ధంగా భారీ నష్టాన్ని చవిచూసింది. స్టేడియం అభివృద్ధి, టోర్నమెంట్ నిర్వహణ కోసం PCB కోట్ల రూపాయలు ఖర్చు చేసింది, కానీ ఫలితం మాత్రం ఘోరంగా మారింది.
మ్యాచ్ల నిర్వహణకు రూ.851 కోట్లు వెచ్చించినా, కేవలం రూ.52 కోట్లు మాత్రమే సంపాదించగలిగింది. దీంతో రూ.799 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ ఆర్థిక సంక్షోభం నేరుగా ఆటగాళ్లపై ప్రభావం చూపింది. పీసీబీ ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు దేశీయ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను భారీగా తగ్గించింది.
ఈ టోర్నమెంట్ లాహోర్, కరాచీ, రావల్పిండి స్టేడియాల్లో జరిగింది. అయితే భద్రతా కారణాల వల్ల భారత జట్టు అన్ని మ్యాచ్లను దుబాయ్లో ఆడింది, ఫైనల్ కూడా అక్కడే జరిగింది.
PCB మూడు ప్రధాన స్టేడియాలను పునరుద్ధరించడానికి రూ.504 కోట్లు (58 మిలియన్ USD) ఖర్చు చేసింది, ఇది వారనుకున్న బడ్జెట్ కంటే 50% ఎక్కువ. టోర్నమెంట్ సన్నాహాలకు రూ.347 కోట్లు (40 మిలియన్ USD) ఖర్చు చేశారు. కానీ, ఇంత పెట్టుబడి పెట్టినా, PCB కేవలం రూ.52 కోట్ల లాభాన్ని మాత్రమే ఆర్జించగలిగింది.
ఈ పరిస్థితి పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. పీసీబీ తన ఆర్థిక నష్టాలను పూడ్చుకోగలదా? పాక్ క్రికెట్ కి ఇది సంక్షోభ సంకేతమా? అనేది చూడాలి.