ఉపఖండంలో ఉద్రిక్తతల మేఘాలు కమ్ముకున్నాయి. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్కు చెందిన మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన ట్వీట్ ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
2025 మే 10 లేదా 11వ తేదీన భారత్ పాక్పై దాడికి దిగే అవకాశముంది” అంటూ బాసిత్ ట్వీట్ చేశారు. రష్యాలో జరగనున్న విక్టరీ డే (మే 9) అనంతరం భారత్ చర్యకు దిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
India will likely carry out its limited misadventure against Pakistan after Victory Celebrations in Russia. Perhaps on 10-11 May.
— Abdul Basit (@abasitpak1) May 6, 2025
మోదీ నివాసంలో హైఅలర్ట్ భేటీ
ఇక దేశ రాజకీయ, భద్రతా వర్గాల్లో ఆందోళన నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం జరిగింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఈ భేటీలో పాల్గొన్నారు. భారత్-పాక్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితులు, పహల్గామ్ దాడికి తగిన ప్రతీకారం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
ఐక్యరాజ్యసమితి స్పందన
భారత్–పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన చేసింది. “ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయి. భావోద్వేగాలకు లోనై సైనిక చర్యలకు దిగకుండా, దౌత్యపరంగా పరిష్కారం వెతకాలి” అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు. పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన, బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నిందితులను చట్టం ముందు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఎక్కడికైనా తీసుకెళ్లే ట్వీట్..?
అబ్దుల్ బాసిత్ ట్వీట్ వాస్తవమేనా? లేక పాక్ వ్యూహంలో భాగమా? అన్నదానిపై స్పష్టత లేనప్పటికీ, భారత్ భద్రతా వ్యవస్థలోని ఆతురత, ప్రభుత్వ హైఅలర్ట్ భేటీలు చూస్తే.. పరిస్థితి చాలా సున్నితంగా మారిందన్నది స్పష్టంగా కనిపిస్తోంది.