కరోనా మళ్లీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. దేశంలో కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 250కి పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఆరోగ్యశాఖ అలెర్ట్.. ఏర్పాట్లలో ప్రభుత్వం
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో వైద్య సిబ్బంది అలెర్ట్ అయ్యారు. వ్యాక్సిన్లు, బెడ్లు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లు మొదలైన అవసరమైన వసతులను సిద్ధం చేస్తున్నారు. మళ్లీ ఒకేసారి వ్యాప్తి కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
కేరళలో విస్తరిస్తున్న కరోనా.. కఠిన చర్యలు
కేరళలో కేసులు వేగంగా పెరుగుతుండటంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణ జార్జ్ అప్రమత్తమయ్యారు. అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేస్తూ హాస్పిటల్స్లో మాస్క్లు తప్పనిసరి చేశారు. దగ్గు, జలుబు వంటి లక్షణాలతో ఆసుపత్రికి వచ్చే వారు మాస్క్ ధరించడం తప్పనిసరిగా ఆదేశించారు.
ఢిల్లీ పరిస్థితి.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్న మంత్రి
ఢిల్లీ రాష్ట్రంలో ఈ నెలలో 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇది సాధారణ ఫ్లూలాంటిదేనని, భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి పంకజ్ సింగ్ స్పష్టం చేశారు. అయినప్పటికీ కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలుగా మాస్క్ ధరించడం, పరిశుభ్రత పాటించడం అవసరమన్నారు.
కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లోనూ అప్రమత్తత అవసరం
కర్ణాటకలో 35, మహారాష్ట్రలో 95 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదు కావడం ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసింది. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్లు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. మరలా కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.