సినిమాల్లోని కొన్ని పాటల్లో అసభ్యకర నృత్య రీతులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, తాజాగా మహిళా కమిషన్ దీనిపై కఠినంగా స్పందించింది. మహిళలను కించపరిచే విధంగా రూపొందించిన కొన్నింటిపై ఫిర్యాదులు అందాయని, ఇలాంటి అంశాలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని కమిషన్ పేర్కొంది.|
ఈ నేపథ్యంలో, నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, కొరియోగ్రాఫర్లు ఇకపై బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరిక జారీ చేసింది. తప్పక చర్యలు ఉంటాయని స్పష్టం చేయడంతో, సినీ పరిశ్రమలో చర్చ మొదలైంది.
కమీషన్ ఎటువంటి సినిమా పేరును ప్రస్తావించనప్పటికీ, ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ఇటీవల విడుదలైన రాబిన్ హుడ్ సినిమాలోని అదిదా సర్ప్రైజ్ పాటతో పాటు, గతంలో వివాదాస్పదమైన డాకు మహారాజ్ మరియు మిస్టర్ బచ్చన్ పాటలే అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మూడు పాటలకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పని చేయడం గమనించదగ్గ విషయం.
పబ్లిసిటీ పరంగా చూస్తే, పాటలు విడుదలైన తర్వాత ఈ సినిమాలకు మంచి ప్రచారం దక్కింది. అయితే, అదే స్థాయిలో విమర్శలూ వచ్చాయి. హీరోయిన్లను ప్రేక్షకులకు చూపిస్తున్న విధానంపై నెగటివ్ కామెంట్లు వెల్లువెత్తాయి. దర్శకుల సమర్థన ఎలా ఉన్నా, ఈ వ్యవహారంపై కమిషన్ నోటీసు విడుదల చేయడం ఇండస్ట్రీకి ఊహించని పరిణామంగా మారింది.
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్
పత్రికా ప్రకటన
తేదీ: మార్చి 20, 2025తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. సినిమా అనేది…
— Sharada Nerella (@sharadanerella) March 20, 2025
ఇప్పటికే విడుదలైన పాటలను మార్చడం సాధ్యం కాకపోయినా, భవిష్యత్లో కొరియోగ్రాఫర్లు మరింత జాగ్రత్తగా ఉండేలా మహిళా కమిషన్ హెచ్చరిక ప్రభావం చూపనుంది. కొందరు ఈ నిర్ణయంపై అనవసర ఫోకస్ అని అభిప్రాయపడుతున్నా, యువత, చిన్న పిల్లలు వీటిని అనుకరించి సోషల్ మీడియాలో వీడియోలు రూపొందించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
ఈ హెచ్చరికతో పరిశ్రమలో మరిన్ని మార్పులు రానున్నాయా? దర్శకులు, కొరియోగ్రాఫర్లు ఇకపై ఏ విధంగా స్పందించబోతున్నారు? అనేది ఆసక్తికరమైన అంశం.