Harish Shankar: పిల్లలు వద్దని నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్‌లో మాస్ సినిమాలకు మాస్టర్‌గా పేరొందిన దర్శకుడు హరీశ్ శంకర్ మరోసారి వార్తల్లో నిలిచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన ఆయన ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే, ఆయన తాజాగా తన వ్యక్తిగత జీవితంపై చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

సాధారణంగా సినీ సెలబ్రిటీలు తమ సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుతారు. కానీ, హరీశ్ శంకర్ మాత్రం తన పర్సనల్ లైఫ్ గురించి ఓకీలకమైన నిర్ణయాన్ని వెల్లడించారు. తన భార్య స్నిగ్ధతో కలిసి పిల్లలు వద్దు అనే నిర్ణయానికి ఎందుకు వచ్చారో వివరించారు.

“మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతలు నాపై పడ్డాయి. మా తల్లిదండ్రులను చూసుకోవడం, తమ్ముడిని సెటిల్ చేయడం, చెల్లికి మంచి పెళ్లి చేయడం.. ఇవన్నీ నా బాధ్యతలుగా భావించాను. నా జీవితంలో ఈ బాధ్యతలతోనే చాలా అలసిపోయా. మళ్లీ పిల్లలు కలిగితే, వారి భవిష్యత్తు గురించి అనేక బాధ్యతలు మోసుకోవాలి. అది మళ్లీ ఓ పెద్ద ప్రయాణమే అవుతుంది. అందుకే, పిల్లలు ఉండకపోతేనే మేమిద్దరం (నేను, నా భార్య) స్వేచ్ఛగా జీవించగలం అనిపించింది.”

హరీశ్ శంకర్ మాటల ప్రకారం, తన భార్య స్నిగ్ధ కూడా ఈ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించింది. “పిల్లలు పుట్టాక, మన జీవితం వారి చుట్టూ తిరుగుతుంది. వారి భవిష్యత్తు, చదువు, ఉద్యోగం, పెళ్లి… ఇలా జీవితాంతం వారి గురించి ఆలోచిస్తూనే ఉంటాం. తల్లిదండ్రులుగా పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది. కానీ, నేను నా జీవితాన్ని అలా గడపాలనుకోలేదు. నా భార్య కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. అందుకే, మేమిద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం” అని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించీ హరీశ్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం, పిల్లలు లేని వ్యక్తి మరింత నిస్వార్థంగా పని చేయగలుగుతాడు.

“నరేంద్ర మోదీ గారు మూడుసార్లు విజయం సాధించడానికి ఆయనకు పిల్లలు లేకపోవడం కూడా ఒక కారణమని నేను భావిస్తున్నాను. ఒక వ్యక్తికి పిల్లలు ఉంటే, వారి భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఆ విషయాలే ఎక్కువ సమయం, శక్తిని తీసుకుంటాయి. కానీ, పిల్లలు లేకపోతే పూర్తి స్థాయిలో తన పని మీద దృష్టి పెట్టగలుగుతాడు. మోదీ గారు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.”

ప్రస్తుతం హరీశ్ శంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు ఆయన ఓపెన్ మైండ్ కి ప్రశంసలు గుప్పిస్తుండగా, మరికొందరు ఈ విషయాన్ని విమర్శిస్తున్నారు.

ఒక్క వర్గం హరీశ్ శంకర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తోంది. “పిల్లలు కలిగే లేదా వద్దనుకునే నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతం. హరీశ్ శంకర్ చాలా క్లారిటీతో ఈ నిర్ణయం తీసుకోవడం మంచి విషయం” అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

మరొక వర్గం మాత్రం “పిల్లలు లేకుండా జీవితం అసంపూర్ణం. భవిష్యత్తులో ఆయన ఈ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు” అంటూ తమ అభిప్రాయాలను తెలియజేస్తోంది.

హరీశ్ శంకర్ తన విశ్వాసాలను, వ్యక్తిగత నిర్ణయాలను బహిరంగంగా పంచుకోవడం నిజంగా దైర్యమైన విషయం. అయితే, ఈ నిర్ణయం అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి!

Leave a Reply