కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా కర్ణాటకలో విడుదలపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ సినిమాకు ఎటువంటి నిషేధం లేదని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అలాగే, స్క్రీనింగ్కు రక్షణ కల్పిస్తామని హామీ కూడా ఇచ్చింది.
దర్శకుడు మణిరత్నం.. హీరో కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘థగ్ లైఫ్’ చిత్రం విడుదల నేపథ్యంలో, కమల్ హాసన్ చేసిన “తమిళం నుంచి కన్నడ పుట్టింది” అన్న వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దాంతో కొన్నిరోజుల పాటు ఈ సినిమాను కర్ణాటకలో నిషేధించాల్సిందిగా డిమాండ్లు వచ్చాయి.
ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఎం. మహేష్ రెడ్డి అనే వ్యక్తి, సినిమా స్క్రీనింగ్కు అనుమతులు ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 17న జరిగిన విచారణలో న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, “ఒక అభిప్రాయంపై సినిమాను నిలిపేయాలా? స్టాండప్ కామెడీకి బ్రేక్ వేయాలా?” అంటూ ప్రశ్నించింది. కళాసృష్టిని నిర్బంధించలేమని స్పష్టం చేసింది.
ఈ పరిణామాల మధ్య, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సినిమాకు పూర్తి రక్షణ కల్పిస్తామంటూ ప్రమాణపత్రాన్ని కోర్టులో దాఖలు చేసింది. దీంతో సుప్రీంకోర్టు పిల్ను ముగించింది.
కమల్ వ్యాఖ్యల నేపథ్యంలో మొదలైన వివాదం చివరకు న్యాయస్థానంలో ముగిసింది. ‘థగ్ లైఫ్’ సినిమాకు ఇక ప్రభుత్వం నుంచి నో అడ్డంకులు.