టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోసారి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా ఆయన్ని లక్ష్యంగా చేసుకుని పూనమ్ పోస్ట్లు పెడుతుండగా… తాజాగా త్రివిక్రమ్పై తన ఫిర్యాదుకు సంబంధించి ఆధారాలతో పాటు స్క్రీన్షాట్స్ను కూడా పంచుకుంది. MAA అసోసియేషన్కు తాను అప్పటికే ఫిర్యాదు చేసానని, కానీ ఇప్పటికీ ఎటువంటి స్పందన రాలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.
“ఆధారాలు నా దగ్గరే ఉన్నాయి”
ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పూనమ్ ఇలా పేర్కొంది:
“ఇప్పటికీ మిమ్మల్ని వదలనని చెబుతున్నా. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్పై MAA అసోసియేషన్కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసాను. MAA మెంబర్ ఝాన్సీతో మాట్లాడినప్పుడు కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత ‘నన్ను డిస్టర్బ్ చేయొద్దు’ అని చెప్పడంతో ఆశ్చర్యపోయాను. నాకేంటో తెలియదు కానీ, త్రివిక్రమ్ను కొందరు రాజకీయ శక్తులు, పరిశ్రమ పెద్దలు కాపాడుతున్నారు.”
2024 స్క్రీన్షాట్ వైరల్
పూనమ్ పోస్ట్ చేసిన స్క్రీన్షాట్లో, MAA సభ్యురాలు ఝాన్సీ చెప్పినట్లు సందేశం ఉంది:
“మీ కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. మహిళా న్యాయవాది వచ్చిన తరువాత మీరు మీ వివరాలను కమిటీకి చెప్పండి.”
ఈ చాటింగ్ 2024లో జరిగిందని పూనమ్ చెబుతోంది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు MAA నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఆమె మండిపడుతోంది.
“కంఫర్ట్ జోన్ నుంచి లాగుతా”
త్రివిక్రమ్ను తాను కచ్చితంగా తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు లాగుతానని, అవసరమైతే మహిళా సంఘాలతో కలిసి ఉద్యమిస్తానని హెచ్చరించింది. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, అవి సరైన కమిటీ ఎదుట పెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసింది.
అయితే త్రివిక్రమ్, పూనమ్ల మధ్య అసలు వివాదం ఏంటో మాత్రం ఇప్పటికీ బయటపడలేదు.