యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హృతిక్ రోషన్తో కలిసి చేస్తున్న భారీ మల్టీస్టారర్ “వార్ 2” షూటింగ్ పూర్తికావడంతో, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ముంబయి వెళ్లారు. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కాబోతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
ఇప్పటికే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్న ఎన్టీఆర్, త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. నాగవంశీ ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో, ఎప్పటినుంచో ఆలస్యం అయిన త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోకి గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబయిలో ఎన్టీఆర్ చేతిలో “మురుగ” అనే పుస్తకం కనిపించింది. దీంతో ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ కథ కోసం ముందుగానే ప్రిపేర్ అవుతున్నాడన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ పుస్తకం పేరు “మురుగ”. రచయిత ఆనంద్ బాలసుబ్రమణ్యన్ దీనిని రచించారు. ట్యాగ్లైన్ – “God of War and Wisdom”. ఇందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం, చరిత్ర, క్షేత్రాలు, ఆయుధాలు, సిద్ధాంతాలు వంటి అనేక అంశాలు వివరంగా ఉంటాయి. త్రివిక్రమ్ సినిమా కథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆధారంగా చేసుకుని తయారవుతోందని టాక్. అందుకే ఎన్టీఆర్ ఇప్పటికే రీసెర్చ్ పనులు మొదలు పెట్టేశాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
అల్లు అర్జున్తో చేయాల్సిన “సుబ్రహ్మణ్యేశ్వర స్వామి” కథను ఇప్పుడు ఎన్టీఆర్తో తెరకెక్కించనున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది పక్కా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది.