మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్న తరుణంలో మెగా అభిమానులకు డైరెక్టర్ అనిల్ రావిపూడి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ఈ మేరకు అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. “ఫైనల్ స్క్రిప్టు వినిపించడం పూర్తయింది. చిరంజీవికి నా కథలోని పాత్ర ‘శంకర్ వరప్రసాద్’ని పరిచయం చేశా. ఆయనకు ఆ రోల్ బాగా నచ్చింది. ఇంకెందుకు లేటు? త్వరలో ముహూర్తంతో.. ‘చిరు’ నవ్వుల పండగబొమ్మకి శ్రీకారం!” అంటూ ట్వీట్ చేశారు. ఈ ప్రకటన వైరల్గా మారింది. చాలా కాలం తర్వాత చిరంజీవి చేస్తున్న పూర్తిస్థాయి కామెడీ మూవీ కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Final script narration done & locked 📝☑️🔒
చిరంజీవి గారికి నా కధ లో పాత్ర
“శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను .. 😄
He loved & enjoyed it thoroughly ❤️🔥ఇంకెందుకు లేటు,
త్వరలో ముహూర్తంతో…
‘చిరు’ నవ్వుల పండగబొమ్మ కి శ్రీకారం 🥳#ChiruAnilMegaStar @KChiruTweets garu…
— Anil Ravipudi (@AnilRavipudi) March 26, 2025
మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్ అని అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు 155 సినిమాల్లో నటించిన చిరంజీవి, పలు ప్రాజెక్టులను అనౌన్స్ చేశారు. కానీ చాలా తక్కువ చిత్రాల్లోనే ఆయన ‘శంకర్’ పేరుతో కనిపించారు. ‘లంకేశ్వరుడు’ సినిమాలో శివ శంకర్గా, ‘ఇంద్ర’ మూవీలో శంకర్ నారాయణగా, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రాల్లో శంకర్ ప్రసాద్గా నటించారు. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాలో శంకర్ వరప్రసాద్గా కనిపించబోతుండటం మెగా ఫ్యాన్స్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
ఈ నెల 30న ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్ నెలలో మొదలవుతుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని అనిల్ రావిపూడి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన గత చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేసి బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
ఇక మెగాస్టార్ ప్రస్తుతం బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నారు. ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఇందులో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి.