పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు ఒక భారీ పీరియడికల్ యాక్షన్-అడ్వెంచర్ డ్రామా. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో, ఔరంగజేబు నిరంకుశత్వం, ఆ కాలంలో ప్రజలు ఎదుర్కొన్న అణచివేతను చూపించనున్నారు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్గా విడుదల కానున్న ఈ చిత్రంలో, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, కీరవాణి సంగీతం అందించారు.
సినిమా కథలో కోహినూర్ వజ్రం దొంగతనం ఒక కీలక భాగంగా ఉంటుంది. నెమలి సింహాసనం నుంచి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే సన్నివేశం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెల్లడించారు. కొల్లూరు గనుల నుంచి ఈ వజ్రం నిజాంకు, ఆపై మొఘలుల చేతికి ఎలా చేరిందనే విషయాన్ని కూడా సినిమాలో చూపించనున్నారు.
కోహినూర్ వజ్రం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిన వజ్రం. దీని చరిత్ర సుదీర్ఘమైనది, ఎన్నో చేతులు మారింది. చరిత్రకారుల ప్రకారం, ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత పల్నాడు జిల్లా, బెల్లంకొండ మండలం కొల్లూరు గనులలో లభించింది.
మొదట ఇది మొఘల్ రాజు బాబర్ చేతికి చేరింది. హుమాయూన్, షాజహాన్, ఔరంగజేబ్ల చేతుల్లో మారుతూ వచ్చింది. షాజహాన్ తన నెమలి సింహాసనంలో దీనిని పొదిగించాడు.
1739లో పర్షియన్ రాజు నాదిర్ షా ఢిల్లీని జయించి, మొఘలుల సంపదను దోచుకెళ్లాడు. అప్పుడే ఈ వజ్రాన్ని చూసి “కోహ్-ఇ-నూర్” (కాంతి పర్వతం) అని పేరు పెట్టాడు. నాదిర్ షా మరణానంతరం, ఈ వజ్రం ఆఫ్ఘన్ పాలకుల చేతుల్లోకి వెళ్లింది. చివరికి పంజాబ్ మహారాజు రంజిత్ సింగ్ దీనిని సొంతం చేసుకున్నాడు.
1849లో సిక్కు యుద్ధంలో ఓటమి పాలైన తర్వాత, మహారాజా దలీప్ సింగ్ ద్వారా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ వజ్రం అప్పగించబడింది. అప్పటి నుంచి ఇది బ్రిటన్ రాణి విక్టోరియా ఆధీనంలోకి వెళ్లింది.
ప్రస్తుతం కోహినూర్ వజ్రం బ్రిటిష్ రాజకుటుంబం ఆధీనంలో ఉంది. ఇది క్వీన్ ఎలిజబెత్ ది క్వీన్ మదర్ క్రౌన్లో పొదగబడి ఉంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణానంతరం, దీనిపై చర్చ మళ్లీ మొదలైంది.
కోహినూర్ వజ్రం అరుదైనది, చరిత్ర కలిగినది కావడంతో దీని ఖచ్చితమైన విలువ అంచనా వేయడం అసాధ్యం. దీన్ని అమూల్యంగా పరిగణిస్తారు. దీని బరువు 105.6 క్యారెట్లు (21.12 గ్రాములు).
కోహినూర్ వజ్రం తమదేనని భారత్తో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలు కూడా వాదిస్తున్నాయి. భారత్ చాలా కాలంగా దీన్ని తిరిగి ఇవ్వాలని బ్రిటన్ను డిమాండ్ చేస్తోంది. అయితే బ్రిటన్ ప్రభుత్వం దీనిని తిరిగి ఇవ్వనని స్పష్టం చేస్తూ వస్తోంది.