కదులుతున్న రైలు నుంచి దూకిన హీరోయిన్.. తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు..!

బాలీవుడ్ నటి కరిష్మా శర్మ ముంబైలో కదులుతున్న లోకల్ రైలు నుండి దూకి గాయపడ్డారు. ఆమె స్నేహితులు రైలు ఎక్కలేదని గమనించి భయంతో ఇలా చేయడం కారణంగా ఆమె తల, వీపు, వెన్ను గాయాలయ్యాయి. ప్రస్తుతం నటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె అభిమానులను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్ (Ragini MMS Returns), ప్యార్ కా పంచనామా (Pyaar Ka Punchnama) వంటి సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కరిష్మా శర్మ, తాజాగా ఒక పెద్ద ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనను ఆమె స్వయంగా సోషల్ మీడియాలో తెలియజేశారు.

షూటింగ్ నిమిత్తం ముంబైలోని లోకల్ ట్రైన్‌లో చర్చిగేట్‌కు వెళ్తుండగా, ఆమె స్నేహితులు రైలు ఎక్కలేదని గమనించి భయంతో కిందికి దూకడం వల్ల గాయపడ్డారని తెలిపారు.

“నిన్న చర్చిగేట్‌లో షూటింగ్ కోసం వెళ్తున్నాను. రైలు వేగం పెరగడంతో భయపడిపోయాను. వెంటనే ట్రైన్ నుంచి దూకినాను. దాని కారణంగా నా వీపు, తల, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. తలకు గాయం కావడంతో డాక్టర్లు MRI స్కాన్ తీసుకున్నారు. నన్ను ఒక రోజు పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. నొప్పి ఉంది కానీ బలంగా ఉన్నాను. దయచేసి త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి” అని ఆమె పేర్కొన్నారు.

అనంతరం కరిష్మా శర్మ స్నేహితురాలు ఆసుపత్రి నుండి ఆమె ఫోటోను షేర్ చేస్తూ, “కరిష్మాకు ఇలా జరిగిందని నమ్మలేకపోతున్నాను. ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తీసుకువచ్చాము. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు” అని తెలియజేశారు.

Leave a Reply